NTV Telugu Site icon

Arvind Kejriwal: ‘‘నేను జైలుకు తిరిగి వెళ్లాలా..? వద్దా..?’’ అంతా మీ చేతుల్లోనే..

Kejriwal

Kejriwal

Arvind Kejriwal: తాను మళ్లీ జైలుకు వెళ్లకూడదంటే ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)కి ఓటేయాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. పంజాబ్‌ రాజధాని అమృత్‌సర్‌లో ఆయన ఈ రోజు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ అభ్యర్థి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్ కోసం ప్రచారం చేశారు. లోక్‌సభలో బీజేపీ భారీ మెజారిటీతో గెలిస్తే ఎస్సీ/ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను దర్దు చేస్తారని ఆప్ ఆధినేత ఆరోపించారు. బీజేపీ నేతలు తాను 20 రోజుల తర్వాత జైలుకు వెళ్లాల్సి ఉంటుందని చెబుతున్నారని, నేను తిరిగి జైలుకు వెళ్లాలా..? వద్దా..? అనేది త మీపై ఆధారపడి ఉందని, ఆమ్ ఆద్మీ పార్టీ గుర్తుకు ఓటేస్తే తాను జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని కేజ్రీవాల్ ప్రజల్ని కోరారు. మీరు ఓటేసేటప్పుడు కేజ్రీవాల్ స్వేచ్ఛ కోసం వేస్తున్నట్లు గుర్తుంచుకోండని సూచించారు. పెద్ద నాయకులను జైల్లో పెట్టారు.. కానీ జైలు మాకు సమస్య కాదు.. మాకు దేశం, రాజ్యాంగం సర్వోన్నతమని ఆయన అన్నారు.

Read Also: Fake Reviews: ఇ-కామర్స్ ప్లాట్ఫామ్లలో నకిలీ సమీక్షలను నిరోధించడానికి సిసిపిఎ త్వరలో చర్యలు..

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరవింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేసి, తీహార్ జైలుకు తరలించింది. 50 రోజుల తర్వాత ఆయనకు సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఎన్నికల ప్రచారం కోసం మే 10న విడుదలైన కేజ్రీవాల్, జూన్ 2న లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇదిలా ఉంటే కేజ్రీవాల్ మధ్యంత బెయిల్ షరతులను ఉల్లంఘిస్తున్నట్లు ఈడీ ఈ రోజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని పరిగణనలోకి తీసుకోవడానికి జస్టిస్ సంజీవ్ ఖన్నా మరియు జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం గురువారం నిరాకరించింది. ఈడీ తరపున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ.. కేజ్రీవాల్ ప్రజలు ఆప్‌కి ఓటేస్తే జూన్ 2 తర్వాత జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని ఎన్నికల ర్యాలీలో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు.