Mamata Banerjee: ఎన్నికల ముందు బెంగాల్ రాజకీయాలు ఉద్రిక్తంగా మారాయి. మాల్దా జిల్లాలో న్యాయాధికారులను గంటల తరబడి బంధించడంపై సుప్రీంకోర్టు రాష్ట్రాన్ని తీవ్రంగా మందలించింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో పేర్లను తొలగించడంపై మొదలైన వివాదం ముట్టడి వరకు వెళ్లింది. సుప్రీంకోర్టు ఈ ఘటనపై తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ.. పశ్చిమ బెంగాల్ రాజకీయంగా అత్యంత విభజించబడిన రాష్ట్రంగా పేర్కొంది. మాల్దా జిల్లాలోని ఒక గ్రామంలో ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) పై పని చేస్తున్న న్యాయాధికారులపై జరిగిన దాడి అనంతరం సుప్రీంకోర్టు ఈ తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
Read Also: Iran: ‘‘మా భారత మిత్రులు సురక్షితం, ఆందోళన అవసరం లేదు’’.. ఇరాన్ మెసేజ్..
ఈ ఘటనపై బెంగాల్ సీఎం, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. సాగర్దిఘిలో జరిగిన ఒక బహిరంగ సభలో ఆమె మాట్లాడుతూ.. ఈ ఘటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని, ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజల్లో ఆగ్రహావేశాలే దీనికి కారణమని ఆమె పేర్కొన్నారు. న్యాయాధికారుల్ని ముట్టడించిన వ్యక్తులు ఎవరో తనకు తెలియదని, నా చేతిలో ఎలాంటి అధికారము లేది, శాంతిభద్రతలతో సహా అన్ని అధికారాలను వారు లాగేసుకున్నారని ఆమె అన్నారు. మాల్దాలో జరిగిన ఘటన బీజేపీ కుట్రలో భాగమని ఆమె ఆరోపించారు. ఓటమి భయంతో ఈ నెలలో జరగాల్సిన ఎన్నికల్ని రద్దు చేయింది, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని ప్లాన్ చేస్తోందని మండిపడ్డారు.
ఎన్నికల సంఘంపై విమర్శలు చేస్తూ.. శాంతిభద్రతల్ని తమ నియంత్రణలో ఉంచుకోవాలని భావించి, చివరకు విఫలమయ్యారని, న్యాయాధికారులకు రక్షణ కల్పించలేకపోయారని అన్నారు. ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందువల్ల న్యాయాధికారులకు భద్రత కల్పించడం ఈసీ బాధ్యత అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. బెంగాల్ ఎన్నికలకు కొన్ని రోజుల ముందు లక్షలాది మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించడంపై బెంగాల్ ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, ఈ నేపథ్యంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ప్రలోభాలకు లొంగొద్దని ఆమె కోరారు.