Bangladesh Lynching: బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు భారత్కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. వరసగా మైనారిటీలను ముఖ్యంగా హిందువుల్ని టార్గెట్ చేస్తూ రాడికల్ ఇస్లామిస్ట్లు హత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల, బంగ్లాదేశ్లోని మైమన్సింగ్ జిల్లాలో దీపు చంద్ర దాస్ అనే 25 ఏళ్ల హిందూ వ్యక్తిని ‘‘దైవ దూషణ’’ ఆరోపణలపై మతోన్మాదులు కొట్టి చంపారు. శరీరాన్ని నగ్నంగా రోడ్డ పక్కన చెట్టుకు వేలాడదీసి, అంతా చూస్తుండగా నిప్పటించి చంపారు. ఈ ఘటన తర్వాత, పోలీస్ విచారణలో, దీపు దైవదూషణ చేసినట్లు ఆధారాలు లేవని తేలింది. ఈ ఘటన మరవక ముందే రాజ్షాహి జిల్లాలో అమృత్ మండల్ అనే మరో హిందూ వ్యక్తిని కొట్టి చంపారు.
గాజాపై కన్నీరు, బంగ్లా హిందువులపై సెలబ్రిటీల మౌనం:
గాజాపై కన్నీరు కారుస్తూ, కొవ్వత్తి ర్యాలీలు చేపట్టే సెలబ్రిటీలు, బంగ్లాదేశ్లో జరుగుతున్న హింసపై మాత్రం పెదవి విప్పడం లేదు. సెలెక్టివ్గా స్పందించే మన సెలబ్రిటీల తీరును చాలా మంది విమర్శిస్తున్నారు. ఎక్కడో గాజాలో మారణహోమం జరిగితే ఎక్స్, ఇన్స్టా, ఫేస్బుక్ వంటి సోషల్ మీడియా వేదికల్లో భావోద్వేగ మెసేజ్ల పెట్టే మన బాలీవుడ్ తారలకు బంగ్లా హింస కనిపించడం లేదు.
బంగ్లాపై స్పందించిన జాన్వీ కపూర్, మరికొంత మంది:
జాన్వీ కపూర్ వంటి కొంత మంది సెలబ్రిటీలు మాత్రమే ‘‘దీపు చంద్ర దాస్’’ హత్యై స్పందించారు. ఆమె ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు. ‘‘బంగ్లాదేశ్లో జరుగుతున్నది అనాగరికం. ఇది ఊచకోత, మరియు ఇది ఒక ఏకాకి సంఘటన కాదు. అతని అమానవీయ బహిరంగ మూకదాడి గురించి మీకు తెలియకపోతే, దాని గురించి చదవండి, వీడియోలు చూడండి, ప్రశ్నలు అడగండి. మరియు అయినప్పటికీ ఇవన్నీ చూసి మీకు కోపం రాకపోతే, ఇలాంటి కపటత్వమే మనకు తెలియకుండానే మనల్ని నాశనం చేస్తుంది. మన సొంత సోదరులు మరియు సోదరీమణులు దహనం చేయబడుతుండగా, మనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న విషయాల గురించి ఏడుస్తూనే ఉంటాం’’ అని ఆమె అన్నారు.
టాలీవుడ్ నటి కాజల్ అగర్వాల్ కూడా బంగ్లాదేశ్ హిందువులకు తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఇన్స్టాగ్రామ్లో ‘‘ఆల్ ఐస్ ఆన్ బంగ్లాదేశ్ హిందూస్’’ పోస్టర్ను షేర్ చేశారు. ‘‘హిందువులారా మేల్కొనండి, నిశ్శబ్దం మిమ్మల్ని రక్షించదు’’ అని ఆమె కామెంట్ చేశారు.
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద కూడా ఈ ఘటనపై మాట్లాడుతూ.. దీపు చంద్ర దాస్ను చంపిన క్రూరత్వం తన హృదయాన్ని రక్తసిక్తం చేసిందని అన్నారు. ‘‘ దీపు చంద్ర దాస్ అనే ఒక అమాయక హిందూ వ్యక్తిని మూకదాడి చేసి చంపారు. వారు అతన్ని చంపడమే కాకుండా, ఒక చెట్టుకు కట్టి నిప్పంటించారు. ఇదేనా కొత్త బంగ్లాదేశ్? ఇది సాధారణ హింస కాదు; ఇది మూకదాడి. ఇది హిందూ మతంపై దాడి. మన దేవాలయాలను కూల్చివేస్తున్నారు, మహిళలపై దాడులు జరుగుతున్నాయి, మనం ఇంకెంత కాలం మౌనంగా ఉంటాం? లౌకికవాదం పేరుతో మనం మౌనంగా ఉంటున్నాం, మనం మన గొంతులను వినిపించాలి, అక్కడి ప్రజలకు సహాయం చేయాలి… మనం అందరం కలిసి వారికి న్యాయం జరిగేలా ప్రయత్నించాలి’’ అని అన్నారు.
సినీ నటుడు మనోజ్ జోషి మాట్లాడుతూ.. గాజా లేదా పాలస్తీనాలో ఏదైనా జరిగితే అందరూ ముందుకు వస్తారు, కానీ బంగ్లాదేశ్లో ఒక హిందువును చంపింతే ఎవరూ ముందుకు రాకపోవడం చాలా బాధకరమని, దీనికి కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. సింగర్ టోనీ కక్కర్, దాస్ హత్యను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. మత వివక్ష విడనాడాలని పిలుపునిచ్చారు.
