తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తమిత్రురాలు, అన్నాడీఎంకే మాజీ నాయకురాలు వి.కె. శశికళ మళ్లీ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్ధమవుతున్నారు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని ఆమె తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇందులో భాగంగా చెన్నైలోని తన నివాసంలో గత కొన్ని రోజులుగా జిల్లా స్థాయి నేతలు, అనుచరులతో ఆమె వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
తన ఆప్తమిత్రురాలు జయలలిత జయంతి రోజైన ఫిబ్రవరి 24న శశికళ తన కొత్త రాజకీయ పార్టీ పేరు, జెండా , విధివిధానాలను ప్రకటించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా ప్రస్తుతం అన్నాడీఎంకే నాయకత్వం పనిచేయడం లేదని, అందుకే కొత్త పార్టీ ద్వారా తమ ఉనికిని చాటాలని ఆమె మద్దతుదారులు ఒత్తిడి తెస్తున్నారు. ప్రస్తుత చర్చల్లో శశికళ ప్రధానంగా రెండు మార్గాలపై దృష్టి సారించినట్లు సమాచారం. సరికొత్త పేరుతో రాజకీయ పార్టీని స్థాపించడం. ఆమె సోదరుడు 2018లో రిజిస్టర్ చేసిన ‘అన్నా ద్రావిడర్ కళగం’ (ADK) పార్టీ తరపున అభ్యర్థులను బరిలోకి దింపడం.
ముఖ్యంగా దక్షిణ తమిళనాడులోని సుమారు 40 నియోజకవర్గాలను టార్గెట్ చేస్తూ శశికళ తన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమాస్తుల కేసులో శిక్ష పడటంతో ఆమె 2027 వరకు ప్రత్యక్షంగా ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హురాలైనప్పటికీ, ఒక రాజకీయ పార్టీకి నాయకత్వం వహించడానికి ఆమెకు చట్టపరంగా ఎటువంటి అడ్డంకులు లేవు. జయలలిత జయంతికి ముందే ఆమె తన తుది నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
IND vs PAK: టీమిండియా చేతిలో చిత్తు చిత్తుగా ఓటమి.. పాక్ జట్టులో భారీ మార్పులు..!
