భర్త వేధిస్తున్నాడనో.. లేదంటే అత్తమామలు వేధిస్తున్నారనో.. లేదంటే వరకట్నం కోసం వేధిస్తున్నారనో విడాకుల కోసం వెళ్లడం చూశాం. కానీ ఉత్తరప్రదేశ్లో నూతన వధువు ఓ వింతైన కారణంతో విడాకులు అడగడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అసలేం జరిగింది. ఆమె ఎందుకు విడాకులు కోరింది. తెలియాలంటే ఈ వార్త చదవండి.
ఉత్తరప్రదేశ్లోని బహసుమా పోలీస్ స్టేషన్ పరిధిలోని రామ్రాజ్కు చెందిన అమ్మాయికి.. ఢిల్లీలోని పటేల్ నగర్కు చెందిన అబ్బాయికి మధ్య వివాహం జరిగింది. అమ్మాయి గ్రాడ్యుయేట్ కాగా.. అబ్బాయి సింగపూర్లో హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ చదివాడు. మ్యాట్రిమోని ద్వారా వివాహం చేసుకున్నారు. పెళ్లైన తర్వాత జంట హనీమూన్కు బయల్దేరారు. అయితే హనీమూన్కు అత్తమామలు, ఆడపడుచు, బావగారు కూడా వచ్చారు. అయితే భర్తతో ఏకాంతంగా గడుపుదాం అనుకుంటే.. కుటుంబమంతా తరలి రావడంతో ఏకాంతాన్ని కోల్పోయింది. ఈ వ్యవహారం రుచించలేదు. వధువు అభ్యంతరం పడింది. తీవ్ర ఆగ్రహాన్ని కూడా కలిగించింది.
తీవ్ర ఆగ్రహానికి గురైన వధువు భర్తతో గొడవ పెట్టుకుంది. తనకు విడాకులు ఇవ్వాలని కోరింది. మీరట్ కోర్టులో విడాకులకు అప్లై చేసుకుంది. ఈ వ్యవహారం కౌన్సిలింగ్ కేంద్రానికి చేరుకుంది. ఇప్పటికే మూడు సార్లు దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తన కుటుంబ సభ్యుల్ని సంతోషం పెట్టాలని ఇలా చేశానని.. మరో ఉద్దేశం లేదని భర్త చెప్పుకొచ్చాడు. అయినా కూడా ఆమె ససేమిరా అంది. సోమవారం మరోసారి కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కూడా వధువు కోపం శాంతించలేదు. విడాకులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేసింది. న్యాయస్థానం ఏం తీర్పు ఇస్తుందో చూడాలి.

