Site icon NTV Telugu

Rekha Gupta: రేఖా గుప్తాను పరామర్శించిన బీజేపీ ఎంపీలు.. దాడి తర్వాత సీఎం ఫొటో విడుదల

Rekhagaupta2

Rekhagaupta2

ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాను పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ఎంపీలు పరామర్శించారు. ఈ సందర్భంగా క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో మనోజ్ తివారీ కూడా ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో తొలిసారి బయటకు వచ్చింది. త్వరలోనే తిరిగి ప్రజలను కలుస్తారని ఎంపీలు చెప్పారు.

ఇది కూడా చదవండి: Tejashwi Yadav: చంద్రబాబు, నితీష్‌కుమార్‌ను బ్లాక్‌మెయిల్ చేసేందుకే బిల్లు.. తేజస్వి యాదవ్ సంచలన వ్యాఖ్యలు

బుధవారం ఉదయం తన నివాసంలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా జనసభ నిర్వహిస్తుండగా.. గుజరాత్‌కు చెందిన జంతు ప్రేమికుడు సకారియా అకస్మాత్తుగా దాడి చేశారు. రేఖా గుప్తా చెంపపై కొట్టి దుర్భాషలాడాడు. దీంతో రేఖా గుప్తాకు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే భద్రతా సిబ్బంది అప్రమత్తమై ఇంట్లోనే చికిత్స అందించారు. ఇంకోవైపు నిందితుడు సకారియాను పోలీసులకు అప్పగించారు. అయితే ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనను మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్ కూడా ఖండించారు.

అసలేం జరిగిందంటే..
ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి కేసులో నిందితుడు రాజేష్ సకారియా పోలీస్ విచారణలో వింతైన విషయాలు వెల్లడించాడు. తాను శివుని భక్తుడినని చెప్పుకొచ్చాడు. వీధి కుక్కల విషయంలో తనను ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి సహాయం కోరమని శివుడు చెప్పాడని పేర్కొన్నాడు. వీధి కుక్కలను తొలగించొద్దని రేఖా గుప్తాను కోరితే పట్టించుకోలేదన్నాడు. అందుకే ఆమెపై దాడి చేసినట్లుగా చెప్పుకొచ్చాడు.

ఇది కూడా చదవండి: Kerala: మలయాళ నటికి యువ నాయకుడు లైంగిక వేధింపులు.. సోషల్ మీడియాలో బాధితురాలు ఆవేదన

ఢిల్లీ వీధుల్లో 8 వారాల్లో వీధి కుక్కలను తొలగించాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. తీర్పు అనంతరం పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమైంది. సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే గుజరాత్‌కు చెందిన జంతు ప్రేమికుడైన రాజేష్ సకారియాకు కోపం తెప్పించింది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న అతడు.. హుటాహుటినా ఢిల్లీకి వచ్చాడు. వీధి కుక్కలను తొలగించొద్దని రేఖా గుప్తాను కోరాడు. బుధవారం ఆమెకు వినతిపత్రం ఇచ్చాడు. అందుకు ఆమె నుంచి రెస్పాన్స్ రాలేదు. దీంతో ఆగ్రహంతో వాగ్వాదానికి దిగాడు. ఆవేశంలో ముఖ్యమంత్రి చెంపపై కొట్టాడు. అంతేకాకుండా దుర్భాషలాడాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అయితే సకారియా చెప్పిన దైవిక జోక్య సిద్ధాంతాన్ని ఢిల్లీ మంత్రి కపిల్ మిశ్రా తోసిపుచ్చారు. కుక్కల విషయంలో దైవ జోక్యం ఉండదన్నారు. ఈ సిద్ధాంతం పూర్తిగా తప్పు అని కొట్టిపారేశారు. నిందితుడికి గతంలో నేర చరిత్ర ఉందన్నారు. అతడొక ప్రొఫెషనల్ నేరస్థుడని పేర్కొన్నారు. వాస్తవాల నుంచి దృష్టిని మళ్లించడానికే యాదృచ్ఛిక సిద్ధాంతాలను ముందుకు తెస్తున్నాడని మంత్రి చెప్పుకొచ్చారు. సకారియాపై అనేక కేసులు ఉన్నాయని.. వాటిలో ఎక్కువ భాగం మద్యం అక్రమ రవాణాకు సంబంధించినవి ఉన్నట్లు చెప్పారు. వీటిలో అనేక కేసుల్లో నిర్దోషిగా విడుదలయ్యాడని చెప్పారు. అయితే ఇంకా అనేక కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారని.. శారీరకంగా గాయాలు తీవ్రంగా ఉన్నాయన్నారు. సాధారణ స్థితికి రావడానికి సమయం పడుతుందని వెల్లడించారు.

ఇదిలా ఉంటే గుజరాత్ నుంచి టికెట్ లేకుండానే రైల్లో ప్రయాణించినట్లు సకారియా చెప్పాడు. ఢిల్లీ చేరుకున్నాక.. ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఎక్కడ ఉంటారని ప్రజలను వాకబు చేశాడు. అనంతరం మెట్రోలో ప్రయాణం చేశాడు. కానీ వేరే స్టేషన్‌లో తప్పుగా దిగిపోయాడు. అనంతరం షాలిమార్ బాగ్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి సైకిల్ రిక్షాలో చేరాడు. ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసి తిరిగి రాత్రి గుజరాత్‌కు వెళ్లిపోవాలని ప్లాన్ చేసుకున్నట్లు సకారియా పోలీసులకు చెప్పాడు. కానీ ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చి వెంటనే వాగ్వాదం పెట్టుకున్నాడు. దుర్భాషలాడాడు. ప్రస్తుతం సకారియాపై హత్యాయత్నం, విధి నిర్వహణలో ప్రభుత్వ ఉద్యోగిని అడ్డుకున్నందుకు ఇతర సెక్షన్లతో పాటు అనేక అభియోగాలు మోపారు.

 

Exit mobile version