Uddhav Thackeray: ఉద్ధవ్ ఠాక్రే పార్టీ మరోసారి చీలిపోయింది. శివసేన(యూబీటీ) ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఉద్ధవ్ సేనకు 9 మంది ఎంపీలు ఉంటే, వీరిలో ఆరుగురు రెబల్ వర్గంగా విడిపోయారు. చడిచప్పుడు కాకుండా అర్ధరాత్రి ఢిల్లీకి చేరుకోవడం, మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేతో రహస్య భేటీ, లోక్సభ స్పీకర్కు లేఖ ఇవ్వడం ఇలా అన్ని ప్రణాళికాబద్ధంగా సాగాయి. శివసేన యూబీటీ ఎంపీలు తిరుగుబాటు ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించారు.
పక్కా ప్లాన్తో ఢిల్లీకి..
తిరుగుబాటు చేసిన ఎంపీల్లో సంజయ్ జాదవ్, సంజయ్ దేశ్ముఖ్, ఓమ్రాజే నింబాల్కర్, భాసాహెబ్ వాక్చౌరే, నాగేశ్ పాటిల్ అష్టికర్, సంజయ్ దినా పాటిల్ ఉన్నారు. వీరంతా జూన్ 14న పార్టీ సమావేశానికి హాజరుకాలేదు. దీని తర్వాత జరిగిన ఆదిత్య ఠాక్రే పుట్టినరోజుకు కూడా వీరు దూరంగా ఉన్నారు. జూన్ 16న ఢిల్లీకి చేరుకున్న మొదటి ఎంపీగా నాగేష్ అష్టికర్ ఉన్నారు. ఆయన తెల్లవారజామును నాందేడ్ నుంచి ప్రైవేట్ జెట్లో దేశ రాజధానిలో ల్యాండ్ అయ్యారు. ఆ తర్వాత మిగతా ఎంపీలు కూడా ప్రత్యేక విమానాల్లో ఢిల్లీకి చేరారు. జూన్ 16తెల్లవారుజామున శివసేన అధినేత ఏక్నాథ్ షిండే కూడా ఢిల్లీకి వెళ్లారు. జూన్ 17న ఉదయం 7 గంటలకు స్పీకర్ ఓం బిర్లాను కలిసి, తామంతా ఏక్నాథ్ షిండే శివసేనలో విలీనం అవుతున్నామని, సభలో తమకు సీట్లను మార్చాలని లేఖ సమర్పించారు.
కాంగ్రెస్లో విలీనం చేస్తారనే భయం..
ఎంపీలు సమర్పించిన లేఖలో ఉద్ధవ్ ఠాక్రే తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తారనే భయాన్ని వ్యక్తం చేశారు. ఇదే కాకుండా 9 మంది ఎంపీల్లో ఆరుగురు తిరుగుబాటు చేయడంతో, ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత తప్పించుకోవడానికి అవసరమైన మూడింట రెండొతుల మెజారిటీ ఉంది. శివసేన ఆవిర్భావ దినోత్సవం జూన్ 20న తిరుగుబాటు ఎంపీలు షిండేను కలవనున్నారు. ఉద్ధవ్ వర్గాన్ని ఎందుకు వీడాల్సి వచ్చిందనే వివరాలను వెల్లడించనున్నారు.

