NTV Telugu Site icon

అసోం జైళ్లలో కలకలం.. 85 మంది ఖైదీలకు హెచ్‌ఐవీ..!

జైళ్లలో ఉన్న ఖైదీలకు హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలిన ఘటన అసోంలో తీవ్ర కలకలం సృష్టిస్తోంది… రాష్ట్రంలోని సెంట్రల్‌ జైలు, నాగావ్‌లోని ప్రత్యేక జైలులో గత నెలలో ఈ కేసులు వెలుగు చూశాయి… రెండు జైళ్లలో కలిపి ఏకంగా 85 మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడంతో.. అధికారులు తలలు పట్టుకుంటున్నారు.. ఇక, ఈ ఘటనపై నాగావ్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ డాక్టర్‌ అతుల్‌ పటోర్‌ వివరణ ఇస్తూ.. ఖైదీల్లో ఎక్కువ మందికి హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని తేలిందన్నారు.. చాలా మంది మాదక్రవ్యాల బానిసలు జైలుకు వచ్చారని.. ఇటీవల వారికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా గుర్తించామని వెల్లడించారు.

కాగా, బాధితుల్లో ఎక్కువ మందిని ఇంట్రావీనస్‌ డ్రగ్‌ తీసుకుంటుండగా నార్కోటిక్‌ డ్రగ్స్‌ అండ్‌ సైకోట్రోపిక్‌ సబ్‌స్టాన్స్‌ యాక్ట్‌, 1985 కింద అరెస్ట్ చేశారు పోలీసులు.. సెంట్రల్‌ జైలులో 40 హెచ్‌ఐవీ పాజిటివ్‌ కేసులు గుర్తించామని జైలర్‌ ప్రబిన్‌ హజారికా వెల్లడించారు.. అయితే, ఖైదీలకు డ్రగ్స్‌ అందుబాటులో లేవని, పాజిటివ్‌ తేలిన వారి నుంచి ఇతరులకు సోకుతుందన్న వార్తలను మాత్రం కొట్టిపారేశారు. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మిగతా కేసులో నాగావ్‌ జైలులో వెలుగుచూవాయి.. డ్రగ్స్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు నాగావ్‌ ఎస్పీ ఆనంద్‌ మిశ్రా.. డ్రగ్స్‌, అక్రమ లైంగిక సంబంధాలు.. హెచ్‌ఐవీ వ్యాధి సంక్రమణకు దారి తీస్తున్నాయని.. చట్టవిరుద్ధమైన లైంగిక కార్యకలాపాల్లో పాల్డొనడం ఒకటైతే.. డ్రగ్స్‌ కూడా మరో కారణంగా చెప్పుకొచ్చారు.