Speaker Election: ఇండియా కూటమి స్పీకర్ ప్రతిపాదనపై తృణమూల్ అసంతృప్తి..

  • ఇండియా కూటమిపై మమతా బెనర్జీ పార్టీ అసంతృప్తి..
  • స్పీకర్ పోస్టుకి పోటీపై కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం..
  • తమని సంప్రదించలేదన్న టీఎంసీ..
Mamata Banerjee

Mamata Banerjee

Speaker Election: దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా స్పీకర్ పోస్టు కోసం అధికార, ప్రతిపక్షాలు పోటీ పడుతున్నాయి. అధికార ఎన్డీయే ప్రభుత్వం తన స్పీకర్ అభ్యర్థిగా ఓం బిర్లాను నామినేట్ చేసింది. మరోవైపు ఇండియా కూటమి తరుపున కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ పేరును ప్రతిపాదించింది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ చేసిన ప్రయత్నాలను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి. తమకు డిప్యూటీ స్పీకర్ పదవిని ఇస్తేనే ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నికకు మద్దతు ఇస్తామని తెలిపింది. ఈ నేపథ్యంలో స్పీకర్ ఎన్నిక అనివార్యంగా మారింది.

ఇదిలా ఉంటే, ఇండియా కూటమి తీసుకున్న నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) ఆగ్రహంగా ఉంది. మమతా బెనర్జీకి చెందిన పార్టీ ఈ విషయంలో అసంతృప్తికి గురైంది. తమను సంప్రదించకుండా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ స్పీకర్ ఎన్నికల ఇండియా కూటమిలో మరోసారి చిచ్చుకు కారణమైంది. ఇది చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. సురేష్‌ని ప్రతిపాదించడంపై టీఎంసీని సంప్రదించి మద్దతు కోరినట్లు సమాచారం.

Read Also: PM Narendra Modi: జూలైలో ప్రధాని మోడీ రష్యా పర్యటన..!

మొదటిసారిగా ప్రతిపక్షాలు స్పీకర్ ఎన్నికపై పోటీలో నిలుచున్నాయి. సాధారణంగా సభలో ఎక్కువ సార్లు ఎంపీగా ఉన్న వ్యక్తిని ప్రొటెం స్పీకర్‌గా నియమించే సంప్రదాయం ఉంది. ఈ లెక్కన కేరళకు చెందిన కాంగ్రెస్ ఎంపీ సురేష్‌ని నియమిస్తారని అనుకున్నారు. అయితే, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భర్తృహరి మహతాబ్‌‌ని నియమించారు. ఇది వివాదాస్పదంగా మారింది. దీనిపై కాంగ్రెస్ మండిపడింది.

స్పీకర్ ఎన్నిక కోసం కాంగ్రెస్ సురేష్‌ని ప్రతిపాదించడాన్ని తాను టీవీల్లో చూశానని తృణమూల్ సీనియర్ నేత సుదీప్ బందోపాధ్యాయ చెప్పారు. ఆ పార్టీకి చెందిన డెరెక్ ఓబ్రియన్ మాట్లాడుతూ, తనను అడిగారు కానీ చర్చలు జరగలేదని చెప్పారు. సురేష్‌కి మద్దతు ఇవ్వడంపై టీఎంసీ సమర్థింస్తుందా..? అనే విషయంపై పార్టీలో చర్చించాల్సి ఉందని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.