ప్రధాని మోడీ అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే ఈ మంత్రివర్గ సమావేశం ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల ప్రధాన మంత్రి కార్యాలయం మారింది. సౌత్ బ్లాక్ నుంచి కొత్తగా నిర్మించిన సేవా తీర్థం నిర్మాణంలోకి మార్చబడింది. ఈ సేవా తీర్థంలోనే తొలి మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రేపటి నుంచి రెండు రోజుల పాటు ఇజ్రాయెల్లో పర్యటించనున్నారు. ఇజ్రాయెల్తో పలు కీలక ఒప్పందాలు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక ఫిబ్రవరి 13న సేవా తీర్థం కొత్త కార్యాలయాన్ని మోడీ ప్రారంభించారు. ఈ కొత్త కార్యాలయంలోకి వెళ్లడానికి కొన్ని గంటల ముందు సేవా తీర్థం గురించి సౌత్ బ్లాక్లో జరిగిన గత మంత్రివర్గ సమావేశంలోనే అనేక జ్ఞాపకాలను మోడీ పంచుకున్నట్లు వర్గాలు తెలిపాయి.
దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ మొదటి నాలుగు కేబినెట్ సమావేశాలు స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్రపతి భవన్లో ఎలా జరిగాయో మంత్రులకు మోడీ వివరించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సౌత్ బ్లాక్లో తీసుకున్న అనేక చారిత్రాత్మక నిర్ణయాలను కూడా గుర్తు చేసుకున్నారు. సౌత్ బ్లాక్లోని వార్ రూమ్లో దేశంలోని నాలుగు ప్రధాన యుద్ధాలకు వ్యూహాలను ఎలా రూపొందించారో మోడీ వివరించారు.
