TMC: పశ్చిమ బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)కి ఇబ్బందులు మొదలయ్యాయి. గత 15 ఏళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా టీఎంసీ గుండాలు సాగించిన దురాగతాలపై సాధారణ ప్రజలు తిరగబడుతున్నారు. ఇదే కాకుండా టీఎంసీ నేత అక్రమాలపై సువేందు అధికారి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన కీలక నేతలు పార్టీకి రాజీనామా చేస్తున్నారు. మరికొందరు పార్టీ పదవుల్ని వదులుకుంటున్నారు.
తాజాగా మాజీ ఎంపీ డాక్టర్ శంతను సేన్ గురువారం టీఎంసీ అధికార ప్రతినిధి పదవికి తక్షణమే అమలులోకి వచ్చేలా రాజీనామా చేశారు. ఆర్జీ కర్ కేసు, పార్టీపై వస్తున్న నిరంతర అవినీతి ఆరోపణలతో తీవ్రంగా మనస్తాపం చెంది ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దీంతో తాను అధికార ప్రతినిధిగా తన పాత్రను నిర్వర్తించే స్థితిలో లేనని శంతను సేన్ అన్నారు.
శంతను సేన్ రాజీనామాకు ముందు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితురాలిగా పేర్కొన్న ఎంపీ కాకోలి ఘోష్ కూడా బుధవారం పార్టీలోని అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. కాకోలి టీఎంసీకి రాజీనామా చేయలేదు. ఆమె ప్రస్తుతం టీఎంసీ ఎంపీగానే ఉన్నారు. ఈ రాజీనామాతో మమతా బెనర్జీ లోక్సభలో విప్గా ఉన్న కాకోలిని ఆ పదవి నుంచి తొలగించి కళ్యాణ్ బెనర్జీకి అప్పగించారు.
