Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్‌లతో దీదీ విలవిల..

  • కూలుతున్న తృణమూల్ కాంగ్రెస్ కోట..
  • 100 మంది కౌన్సిలర్ల రాజీనామా, నేతల పక్క చూపులు..
  • బీజేపీ దూకుడుకు మమతా బెనర్జీ విలవిల..
Mamata Banerjee

Mamata Banerjee

Mamata Banerjee: తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) నిన్న మొన్నటి వరకు అజేయ శక్తి. మమతా బెనర్జీని ఓడిపోగానే పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. టీఎంసీ పార్టీలో ముసలం పుట్టినట్లు కనిపిస్తోంది. బీజేపీ భారీ గెలుపుతో టీఎంసీ నేతలు వరసగా రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు మమత మాటల్ని ఖాతరు చేయడం లేదు. ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ వంటి వారు బహిరంగంగానే సొంత పార్టీపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు మున్సిపాలిటీల్లోని 100 మంది కౌన్సిలర్లు రాజీనామా చేయడం సంచలనంగా మారింది. ఇది ఇక్కడితేనే ఆగే పరిస్థితి లేకుండా పోయింది. త్వరలోనే టీఎంసీ సంక్షోభం మరింత ముదిరే అవకాశాలే కనిపిస్తున్నాయి.

వచ్చే ఏడాది పురపాలక ఎన్నికలకు ముందే రాష్ట్రంలోని చాలా పాలకమండళ్లు రద్దయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు మమతా సన్నిహితుడు, కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. మమతా రాజీనామాలు చేయొద్దని కోరినప్పటికీ ఎవరూ మాట వినడం లేదు.

సీఎం సువేందు వార్నింగ్‌తో మారిన పరిస్థితి:

స్థానిక సంస్థల గత కార్యకలాపాలను క్షుణ్ణంగా పరిశీలించి చర్యలు తీసుకుంటామని సీఎం సువేందు అధికారి వార్నింగ్ ఇవ్వడంతో రాజీనామాల వెల్లువ ప్రారంభమైంది. కొందరు టీఎంసీ కౌన్సిలర్లు తమ ఆఫీసులకు వెళ్లడమే మానేశారు. అవినీతి, దోపిడీ ఆరోపణలపై టీఎంసీకి చెందిన కొందరు కౌన్సిలర్లను అరెస్ట్ చేయడం మరింత భయాలను వారిలో నింపాయి.

ఇదే కాకుండా సౌత్ డుమ్ డుమ్ టీఎంసీ కౌన్సిలర్ సంజయ్ రాయ్ అనుమానాస్పద మృతి తీవ్రతను మరింత పెంచింది. తృణమూల్ నేత దేబ్రాజ్ చక్రవర్తికి సన్నిహితుడిగా పేరున్న సంజయ్ రాయ్ భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఉరివేసుకుని మరణించాడు. టీఎంసీ ఎమ్మెల్యే అదితి మున్షీ భర్త అయిన చక్రవర్తి మున్సిపల్ నియామకాల్లో భారీ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో మాజీ టీఎంసీ మంత్రి సుజిత్ బోస్‌ను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.

టార్గెట్ అభిషేక్ బెనర్జీ, నేతల అసంతృప్తి:

మమతా బెనర్జీ మేనల్లుడు, ఎంపీ అభిషేక్ బెనర్జీ అవినీతి చిట్టా బయటకు వస్తోంది. ఇటీవల కోల్‌కతా మున్సిపల్ కార్పొరేషన్ అభిషేక్‌కు సంబంధించినట్లు చెబుతున్న 17 ఆస్తులకు కూల్చివేత నోటీసులు ఇచ్చింది. ఈ వ్యవహారంలో కోల్‌కతా మేయర్ ఫిర్హాద్ హకీమ్ పాత్ర ఉందనే చర్చ మొదలైంది. ఆయన మేయర్ పదవి నుంచి తప్పుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

టీఎంసీ సీనియర్ నేత, లోక్‌సభ ఎంపీ కాకోలి ఘోష్ దస్తిదార్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేయడం పెద్ద షాక్‌గా మారింది. ఆమె బహిరంగంగానే ఐ-ప్యాక్ సంస్థపై విమర్శలు చేశారు. టీఎంసీ పతనానికి కారణమయ్యారని ఆరోపించారు. ఇటీవల మమతా నిర్వహించిన ఒక నిరసర కార్యక్రమానికి 80 మంది ఎమ్యెల్యేలకు గానూ 36 మంది మాత్రమే హాజరు కావడం పార్టీలో సంక్షోభాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. టీఎంసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు బీజేపీ సమావేశాలకు హాజరుకావడం కూడా రాజకీయ ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ పరిణామాలు చూస్తే సమీప భవిష్యత్తులో టీఎంసీకి భవిష్యత్తు లేదనేది ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లో కనిపిస్తోంది. బీజేపీ ఘన విజయం తర్వాత రాష్ట్రంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. గత 15 ఏళ్ల పాలనలో టీఎంసీ నేతలు, కార్యకర్తల అరాచకాలపై సాధారణ ప్రజలే విరుచుకుపడుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో మమతా బెనర్జీ పార్టీని గాడిలో పెట్టే పరిస్థితి కనిపించడం లేదు. ఇక అభిషేక్ బెనర్జీని బీజేపీ నెమ్మదిగా టార్గెట్ చేస్తోంది. ఈ పరిణామాలు కింది స్థాయి టీఎంసీ నేతల్లో భయాలను మరింత పెంచుతున్నాయి.

బీజేపీలో చేరేందుకు విశ్వ ప్రయత్నం:

మరోవైపు బీజేపీ గేట్లు తెరిస్తే టీఎంసీ ఖాళీ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే చాలా మంది నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. కానీ బీజేపీ వీరిని ఆహ్వానించడం లేదు. మమతా బెనర్జీ పాలనలో వీరు చేసిన అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే బీజేపీలో చేరేందుకు సిద్ధమైనట్లు కాషాయ నేతలు భావిస్తున్నారు. స్థానిక ఎన్నికలు ముగిసే వరకు ఎవరిని తమ పార్టీలోకి రానిచ్చేది లేదని బీజేపీ చెబుతోంది.