Site icon NTV Telugu

Jammu Kashmir: ఆర్మీ క్యాంపుపై ఉగ్రదాడి.. ఇద్దరు ఉగ్రవాదులు హతం, ముగ్గురు జవాన్లు వీరమరణం

Jammu Kashmir

Jammu Kashmir

Jammu Kashmir: జమ్మూకశ్మీర్‌లోని రాజౌరిలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. రాజౌరీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడికి ప్రయత్నించారు. ఈ ఉగ్రదాడిలో ముగ్గురు జవాన్లు అమరులయ్యారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హల్ ప్రాంతంలోని పర్గల్‌లోని ఆర్మీ క్యాంప్‌పై దాడి చేసేందుకు ఉగ్రవాదులు యత్నించారు. గురువారం తెల్లవారుజామున ఆర్మీ క్యాంప్ ఫెన్సింగ్​ దాటుకుని లోపలకు చొరబడేందుకు యత్నించారు. భారీ కాల్పులకు దిగారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది.. వారిపై కాల్పులు జరిపారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం మట్టుపెట్టగా.. ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడుతున్న ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టడంలో గాయపడిన ముగ్గురు భారత ఆర్మీ సిబ్బంది గురువారం మరణించారు. మరో ఇద్దరు జవాన్లు గాయపడగా.. వారిని వైద్య చికిత్స కోసం తరలించారు. ఆ ఆపరేషన్‌లో సుబేదార్ రాజేంద్ర ప్రసాద్, రైఫిల్‌మెన్ మనోజ్ కుమార్ రైఫిల్‌మెన్ లక్ష్మణన్ డి దేశం కోసం అత్యున్నత త్యాగం చేశారు.

అయితే, సైన్యం ఇక్కడ స్థావరంపై ఆత్మాహుతి బాంబు దాడిని అడ్డుకుని ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది. ఈ ఘటనతో అప్రమత్తమైన అధికారులు వెంటనే అక్కడికి అదనపు బలగాలను పంపారు. 16 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ మంజీందర్ సింగ్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆ ప్రాంతాన్ని శానిటైజ్ చేస్తున్నట్లు వారు తెలిపారు. రాజౌరీలోని దర్హాల్ ప్రాంతంలో ఉన్న పర్గల్‌లోని రాష్ట్రీయ రైఫిల్స్ యూనిట్‌కు చెందిన కంపెనీ ఆపరేటింగ్ బేస్‌పై ఉరీ తరహా దాడికి ప్రయత్నించినట్లు కనిపిస్తోంది. దేశంలో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగడానికి రెండ్రోజుల ముందు ఆర్మీ క్యాంపులోకి చొరబడే ప్రయత్నం జరిగింది. బుద్గామ్‌లో ముగ్గురు లష్కరే తొయిబా ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టిన ఒక రోజు తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం. హతమైన టెర్రరిస్టులలో ఒకరు పౌర హత్యలతోపాటు రాహుల్ భట్, అమ్రీన్ భట్‌ల హత్యల్లో పాల్గొన్నాడు.

Rajiv Gandhi Assassination: రాజీవ్ గాంధీ హత్య కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన నళిని

కొన్నాళ్లుగా జమ్మూకశ్మీర్‌లో టెర్రర్ ఆపరేషేన్ కొనసాగుతోంది. బుధవారం కూడా భారీ ఉగ్రకుట్రను భద్రతా బలగాలు భగ్నం చేశాయి . పుల్వామాలో 30 కిలోల పేలుడు పదార్థాలను భద్రతాబలగాలు సీజ్ చేశాయి. మరోవైపు పంద్రాగస్టు సందర్భంగా కశ్మీర్ లో భద్రతను కట్టుదిట్టం చేశారు అధికారులు. రైల్వే స్టేషన్లలో నిఘా పెట్టారు. ఉధంపూర్ కాట్రా రైల్వే లింక్ దగ్గర భారీగా బలగాలు మోహరించాయి.

Exit mobile version