Taslima Nasrin: ప్రవాసంలో ఉంటున్న వివాదాస్పద బంగ్లాదేశీ రచయిత్రి తస్లీమా నస్రీన్ 20 ఏళ్ల తర్వాత కోల్కతా రాబోతున్నారు. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె బెంగాల్ గడ్డపై అడుగుపెడుతున్నారు. తస్లీమా ఆగస్టు 1వ తేదీన రవీంద్ర సదన్లో జరిగే ఛాందసవాద వ్యతిరేక కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కవులు, రచయితలు పాల్గొంటున్నారు. ఈ శుభవార్తను తస్లీమా స్వయంగా సోషల్ మీడియాలో ప్రకటించారు. లెఫ్ట్ ప్రభుత్వాలు బెంగాల్లో అధికారంలో ఉన్న సమయంలో ఆమెకు వ్యతిరేకంగా భారీ నిరసనలు జరిగాయి. దీంతో 2007లో తస్లీమా కోల్కతా విడిచి వెళ్లారు. అప్పటి నుంచి పలు సందర్బాల్లో నగరంలో అడుగుపెట్టేందుకు ప్రయత్నించారు. కానీ భద్రతా కారణాలు చూపుతూ అనేక కార్యక్రమాలను రద్దు చేశారు.
తస్లీమా నస్రీన్ రాసిన ‘‘లజ్జ’’ పుస్తకం బంగ్లాదేశ్లో తీవ్ర వివాదస్పదమైంది. ఇస్లాంలోని దురాగతాలను ఆమె ఈ పుస్తకంలో ప్రస్తావించారు. దీంతో బంగ్లాలో మతోన్మాదులు ఆమెపై ఫత్వా జారీ చేసి, చంపేస్తామని బెదిరించారు. అజ్ఞాతంలో ఉన్న తర్వాత, ఆమె 1994 చివరలో స్వీడన్కు పారిపోయి ప్రవాస జీవితం గడుపుతున్నారు. ఆమె రాసిన అనేక పుస్తకాలు బంగ్లాదేశ్లో నిషేధానికి గురయ్యాయి.
తస్లీమా తన కోల్కతా రాక గురించి సోషల్ మీడియాలో స్పందించారు. ఉస్మాన్ మాలిక్ చేసిన ఒక పోస్టునున ఆమె షేర్ చేస్తూ.. దాదాపు 20 ఏళ్ల తర్వాత కోల్కతా తిరిగి వస్తున్న విషయాన్ని ధ్రువీకరించారు. ఆమె పర్యటనపై చాలా మందిలో ఆసక్తి నెలకొంది. కోల్కతాతో తస్లీమాకు ప్రత్యేక భావోద్వేగ సంబంధం ఉంది. తన రచనల్లో ఈ నగరం కీలక పాత్ర పోషించిందని ఆమె పలుమార్లు పేర్కొన్నారు. తనకు అత్యంత ఇష్టమైన నగరం కోల్కతా అని చాలా సార్లు చెప్పారు. సెక్యులర్ మిషన్, హెచ్ఆర్బిఎఫ్ఎఫ్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమానికి ఆమె వస్తు్న్నారు.

