Tamil Nadu Eections 2026: టీవీకే సంచలన నిర్ణయం.. విజయ్ ప్రత్యేక టీమ్‌లు.. తమిళ రాజకీయాల్లో ఉత్కంఠ

Tvk Chief Vijay Forms Speci

Tvk Chief Vijay Forms Speci

Tamil Nadu Eections 2026: తమిళనాడు రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ముఖ్యంగా టీవీకే పార్టీ తీసుకుంటున్న తాజా నిర్ణయాలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. పార్టీ అధినేత విజయ్ ముందస్తు వ్యూహాలతో ముందుకు సాగుతూ, ఎన్నికల ఫలితాల తర్వాత పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కీలక ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. తమ పార్టీ అభ్యర్థులు గెలిచిన వెంటనే కౌంటింగ్ హాళ్ల నుంచి వారిని సురక్షితంగా తరలించేందుకు విజయ్ ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఇప్పటికే మహాబలిపురంలో రిసార్ట్ బుక్ చేయడం ద్వారా ‘క్యాంప్ పాలిటిక్స్’కు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులను మహాబలిపురం రిసార్ట్‌కు తీసుకెళ్తారా లేదా మరే రహస్య ప్రదేశంలో ఉంచుతారా అన్నది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.

ఇక ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత టీవీకే పార్టీ వ్యూహాల్లో మార్పులు చోటుచేసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార పోరులో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ముందుగానే ఈ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, కాసేపట్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలోని 234 నియోజకవర్గాల్లో మొత్తం 85.10 శాతం పోలింగ్ నమోదైంది. ఇందులో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువగా పాల్గొనడం విశేషం.

రాష్ట్రవ్యాప్తంగా 62 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరగనుండగా, ఈవీఎంల కోసం 3,324 టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం 993 టేబుళ్లు, సర్వీస్ ఓటర్ల కోసం 294 టేబుళ్లు ఏర్పాటు చేశారు. చెన్నై జిల్లాలోనే అత్యధికంగా 291 టేబుళ్లు ఏర్పాటు చేయడం జరిగింది. కౌంటింగ్ నిర్వహణ కోసం 1,135 మంది అదనపు అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు నియమించగా, మొత్తం 10,545 మంది సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నారు. భద్రత పరంగా కూడా భారీ ఏర్పాట్లు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద 65 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. ప్రతి టేబుల్ వద్ద మైక్రో అబ్జర్వర్లు, సీసీటీవీ పర్యవేక్షణలో కౌంటింగ్ జరుగనుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్లను లెక్కించి, అనంతరం ఈవీఎంల ఓట్లను లెక్కించనున్నారు.

ఈ ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు కాగా, అధికారంలోకి ఎవరు వస్తారనే ఉత్కంఠ నెలకొంది. డీఎంకే, ఏఐఏడీఎంకే కూటమి, అలాగే విజయ్ నేతృత్వంలోని టీవీకే మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ కొళత్తూరు నుంచి పోటీ చేస్తుండగా, మాజీ సీఎం పళని స్వామి ఎడప్పాడి నుంచి బరిలో ఉన్నారు. చెపాక్-తిరువల్లికేని నుంచి ఉదయ్ నిధి స్టాలిన్ పోటీ చేస్తున్నారు. టీవీకే అధినేత విజయ్ పెరంబూర్ మరియు తిరుచ్చి ఈస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఇక కన్యాకుమారి, తూత్తుకుడి, తిరునెల్వేలి, తెంకాసి జిల్లాల్లోని కొన్ని సమస్యాత్మక కేంద్రాలను ఎన్నికల సంఘం గుర్తించి, అక్కడ భారీగా పోలీసు భద్రత ఏర్పాటు చేసింది.

సర్వేలు హంగ్ ఏర్పడే అవకాశాలను సూచిస్తున్న నేపథ్యంలో, టీవీకే పార్టీ చేపట్టిన క్యాంప్ రాజకీయాలు మరింత చర్చకు దారి తీస్తున్నాయి. గెలిచిన అభ్యర్థులను వెంటనే రిసార్ట్‌కు తరలించాలని పార్టీ ఆదేశాలు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠను పెంచుతోంది. మొత్తానికి, తమిళనాడు రాజకీయాలు రోజురోజుకూ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలాంటి మలుపు తీసుకుంటాయో అన్నది ఇప్పుడు అందరి దృష్టి ఆకర్షిస్తోంది.