Tamil Nadu: అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం.. సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్.. కారణమిదేనా?

  • తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త తగాదాలు
  • అలాగైతే కేబినెట్ నుంచి వైదొలుగుతాం
  • సీఎం విజయ్‌కు కాంగ్రెస్ వార్నింగ్
Cmvijay

Cmvijay

తమిళనాడులో సంకీర్ణ ప్రభుత్వంలో కొత్త తగాదాలు మొదలయ్యాయి. ఇటీవల ఓ మీడియా సంస్థ నిర్వహించిన సర్వేలో సీఎం విజయ్ ప్రధాని రేసులో మూడో స్థానంలో ఉన్నట్లు తేలింది. అప్పటి నుంచి టీవీకే ఆధ్వర్యంలో నేతలు విజయ్‌ జాతీయ నాయకుడిగా కీర్తిస్తున్నారు. ప్రధాని అభ్యర్థి అంటూ ప్రచారం చేస్తున్నారు. ఈ వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్‌కు ఆగ్రహాన్ని తెప్పించింది. టీవీకే ఇలాంటి ప్రచారం ఆపకపోతే కేబినెట్ నుంచి వైదొలుగుతామని హస్తం నేతలు హెచ్చరించారు. 2029లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని.. దీనికి టీవీకే మద్దతు లభించకపోతే మంత్రివర్గం నుంచి తప్పుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.

తమిళనాడులో విజయ్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. ఎంకే స్టాలిన్ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ కూడా ఇందులో భాగమైంది. మొదటి టర్మ్‌లోనే విజయ్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ప్రధానమంత్రి పదవిపై ఆయనకున్న ఆశలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆయన ఎప్పుడూ బహిరంగంగా ఏమీ చెప్పనప్పటికీ.. తమిళనాడులో ‘ప్రధానమంత్రిగా విజయ్’ అనే ప్రచారం జరుగుతోంది. ఇది కాంగ్రెస్ పార్టీలో అశాంతికి కారణమైంది. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ కోటాకు చెందిన పర్యాటక శాఖ మంత్రి రాజేష్ కుమార్ ఈ ప్రచారంపై ఒక ప్రకటన విడుదల చేశారు. కూటమిలో ఉంటూనే టీవీకే ప్రధానమంత్రి పదవికి రాహుల్ గాంధీ అభ్యర్థిత్వానికి మద్దతు ఇవ్వకపోతే తాము విజయ్ మంత్రివర్గం నుంచి వైదొలుగుతామని అన్నారు. మరోవైపు డీఎంకే కూడా సీఎం విజయ్‌ను ఎద్దేవా చేస్తూ ఐరాస చీఫ్ అవుతారంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించింది.

తమిళనాడులో కొత్తగా ఏర్పడిన విజయ్‌ ప్రభుత్వానికి కాంగ్రెస్‌తో పొత్తును కొనసాగించడం కీలకం. ఎందుకంటే రాష్ట్రంలో మెజారిటీ 118 సీట్లు కాగా.. టీవీకేకు సొంతంగా కేవలం 107 సీట్లు మాత్రమే ఉన్నాయి. అందువల్ల పొత్తులో ఎలాంటి ఉద్రిక్తతలు రాకుండా చూసుకోవడం ప్రస్తుతం అవసరం.