CM Vijay: తమిళనాడు ప్రభుత్వం కొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పుట్టిన బిడ్డకు ఒక గ్రాము బంగారు ఉంగారాన్ని అందించే పథకాన్ని సెప్టెంబర్ 28న సీఎం విజయ్ అధికారికంగా ప్రారంభించబోతున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు తొలి విడతలో ఉంగరాలు పంపిణీ చేయనున్నారు. ‘తైమామన్ తంగా మోతిరం తిట్టం’గా ఈ పథకానికి నామకరణం చేశారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ ఇచ్చిన హామీల్లో ఇది ఒకటి. ప్రభుత్వం ఆస్పత్రుల్లో జన్మించిన శిశువుకు ఒక గ్రాము బరువు ఉన్న 22 క్యారెట్ల బంగారు ఉంగరాన్ని అందించడం ఈ పథకం ఉద్దేశ్యం. ఈ పథకాన్ని సీఎం విజయ్ జన్మదినమైన జూన్ 22నుంచి అమలు చేస్తున్నారు. అంటే, జూన్ 22 నుంచి రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో జన్మించిన శిశువులకు తొలి విడతలో ఉంగరాలు అందించనున్నారు.
తొలి విడత పంపిణీ కోసం 1.28 లక్షల ఒక గ్రాము బంగారు ఉంగరాలను ప్రభుత్వం సమకూర్చింది. సెప్టెంబర్ 28 నుంచి వీటిని లబ్ధిదారులకు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతీ ఉంగరానికి ఒక సీరియన్ నెంబర్ ఉంటుందని, ట్యాంపర్ ప్రూఫ్ ప్యాకేజింగ్లో వీటిని అందించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ పథకం పొందాలంటే తమిళనాడులో శాశ్వత నివాసితులై ఉండాలి. తమిళనాడు మెడికల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా జొయాలుక్కాస్, కళ్యాణ్ జువెల్లర్స్ నుంచి ఉంగరాలు కొనుగోలు చేశారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ఏడాదికి రూ. 755.83 కోట్లు కేటాయించింది. ఏడాది కాలంలో సుమారు 4.41 లక్షల ఒక గ్రాము, 22 క్యారెట్ల బంగారు ఉంగరాలను పంపిణీ చేయడానికి ఈ నిధులు ఉపయోగించనున్నారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ్ తనను గెలిపిస్తే, నవజాత శిశువులకు మేనమామ బంగారం బహుమతి కింద పథకాన్ని ప్రారంభిస్తానని చెప్పారు. మహాబలిపురంలో పార్టీ నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ హామీ ఇచ్చారు. తాజాగా విజయ్ సర్కార్ తన హామీని అమలు చేయబోతోంది.

