ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడితో దురుసుగా ప్రవర్తించారు కేంద్రం మంత్రి సురేష్ గోపి. తన నియోజకవర్గమైన త్రిశ్శూర్ పర్యటనలో ఓ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడి మరో వివాదానికి ఆయన తెరలేపారు.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఇంటి నిర్మాణం కోసం అభ్యర్థించిన ఓ వృద్ధుడి దరఖాస్తు తీసుకునేందుకు ఇటీవల తిరస్కరించిన మంత్రిపై విమర్శలు వెల్లువెత్తాయి. అమలు చేయలేని హామీలు తాను ఇవ్వబోనంటూ ఆ వైఖరిని సమర్థించుకున్నారు. త్రిశ్శూర్ పర్యటనలో ఓ వృద్ధ మహిళతో దురుసుగా మాట్లాడి మరో వివాదంలో చిక్కుకున్నారు.
సీపీఎం నేతల ప్రమేయం ఉన్నట్లుగా ఆరోపణలున్న కరువన్నూర్ సహకార బ్యాంకు కుంభకోణంలో పలువురి డిపాజిట్లు ఆగి పోయాయి. దీనిపై ఈడీ దర్యాప్తు జరుగుతోంది. ఆనందవల్లి అనే మహిళ తన డిపాజిట్ సొమ్ము తిరిగి ఇప్పించడంలో సహకరించాలని కేంద్ర మంత్రి సురేష్ గోపిని కోరారు. వెళ్లి మీ మంత్రికో, ముఖ్యమంత్రికో చెప్పుకోమని.. అంతే కాకుండా తన ముందు ఎక్కువగా మాట్లాడవద్దు అంటూ దురుసుగా మాట్లాడారు. ‘మీరు కూడా మా మంత్రే కదా మహిళ అని చెప్పడంతో..నేను దేశానికి మంత్రిని అని ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన మాట్లాడిన విధానం వైరల్ గా మారింది. లోక్సభ ఎన్నికల ప్రచారంలో తమ డిపాజిట్లు వెనక్కు రప్పిస్తానని సురేశ్ గోపి హామీ ఇచ్చారని, ఆయన కటువుగా మాట్లాడకుండా తన అభ్యర్థనను పరిశీలిస్తానని చెప్పినా సరిపోయేదని ఆనందవల్లి మీడియాకు తెలిపారు.