ఆ మధ్య కాలంలో ఎన్సీఈఆర్టీ (NCERT) 8వ తరగతి పాఠ్యపుస్తకంగా ‘‘న్యాయవ్యవస్థలో అవినీతి’’ అనే పాఠంపై దేశ సర్వోన్నత న్యాయస్థానం చాలా సీరియస్ అయింది. గత ఫిబ్రవరిలో చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉద్దేశపూర్వకంగానే న్యాయవ్యవస్థను గురించి విద్యార్థులకు తప్పుడు సందేశాన్ని పంపిస్తున్నారని ఫైర్ అయింది. దీంతో ఎన్సీఈఆర్టీ బహిరంగంగా క్షమాపణ చెప్పింది. అభ్యంతరకర పాఠ్యాంశాలను వెబ్సైట్ నుంచి తొలగించి.. పుస్తకాల పంపిణీని నిలిపివేసింది.
తాజాగా సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ముగ్గురు విద్యావేత్తలపై విధించిన నిషేధాన్ని ఉపసంహరించుకుంది. అలాగే వారు ఉద్దేశపూర్వకంగా వాస్తవాలను వక్రీకరించారన్న వ్యాఖ్యలను కూడా న్యాయస్థానం వెనక్కి తీసుకుంది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం.. ప్రొఫెసర్ మైఖేల్ డానినో, సుపర్ణ దివాకర్, అలోక్ ప్రసన్న కుమార్లపై మార్చి 11న జారీ చేసిన ఆదేశాలను సవరించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు, విశ్వవిద్యాలయాలు, విద్యాసంస్థలు ఈ ముగ్గురు విద్యావేత్తలను అకడమిక్ కార్యకలాపాల నుంచి దూరంగా ఉంచాలని ఇచ్చిన ఆదేశాన్ని తాజాగా రద్దు చేసింది.
“దరఖాస్తుదారులు ఇచ్చిన వివరణను పరిశీలించిన తర్వాత.. గత ఆదేశంలోని 8వ పేరాలో ఉన్న సూచనలను సవరించడం సముచితమని భావిస్తున్నాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లేదా ఇతర సంస్థలు స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవచ్చు” అని సీజేఐ సూర్యకాంత్ పేర్కొన్నారు. అలాగే ఈ ముగ్గురు విద్యావేత్తలు కావాలనే వాస్తవాలను తప్పుగా చూపించారన్న వ్యాఖ్యలను కూడా ధర్మాసనం వెనక్కి తీసుకుంది. వారు ఇచ్చిన వివరణల నేపథ్యంలో ఆ వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 2026లో “మన సమాజంలో న్యాయవ్యవస్థ పాత్ర” అనే అధ్యాయంలో న్యాయవ్యవస్థలో అవినీతిపై ఉన్న కొన్ని అంశాలు వివాదానికి దారితీశాయి. మీడియా కథనాల నేపథ్యంలో సుప్రీంకోర్టు స్వయంగా ఈ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించింది. అనంతరం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్(NCERT) ఆ భాగాన్ని “అనుకోకుండా జరిగిన పొరపాటు”గా పేర్కొంటూ పుస్తకం నుంచి తొలగించింది. ఈ కేసు విచారణ సమయంలో సుప్రీంకోర్టు ఆ పుస్తకం ముద్రణ, పంపిణీపై తాత్కాలిక నిషేధం విధించింది. అలాగే పాఠ్యపుస్తకాల తయారీ, సిలబస్ రూపకల్పనలో ఈ ముగ్గురు నిపుణులను ఎట్టి పరిస్థితుల్లోనూ భాగస్వామ్యం చేయరాదని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా ఆ ఆదేశాలను సుప్రీంకోర్టు సవరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోసారి న్యాయస్థానం నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
