డాక్టర్లపై రాజకీయ పార్టీ నేతలు, కార్యకర్తలు దాడులకు పాల్పడుతున్న ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహారాష్ట్రలో వైద్యులపై దాడులకు పాల్పడే రాజకీయ నేతలను వెంటనే అదుపులోకి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాంటి వ్యక్తులను స్వేచ్ఛగా తిరగనివ్వొద్దని స్పష్టం చేసింది. కళ్యాణ్లోని శాస్త్రినగర్ ఆసుపత్రిలో వైద్యులపై దాడి చేసిన కేసులో శివసేన కౌన్సిలర్ రమేశ్ మ్హాత్రే బెయిల్ షరతులను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
బెయిల్ రద్దు కోరిన మహారాష్ట్ర ప్రభుత్వం
మ్హాత్రే తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. అయితే ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. మరోవైపు మ్హాత్రేకు మంజూరైన బెయిల్ను రద్దు చేయాలని మహారాష్ట్ర ప్రభుత్వం కోరినట్లు కోర్టుకు తెలిపింది. ఈ అంశంపై సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసి.. తదుపరి విచారణను సెప్టెంబర్ 28కి వాయిదా వేసింది.
ఆసుపత్రిలో ఏం జరిగింది?
దహీ హండి ఉత్సవాల సందర్భంగా గాయపడిన ఓ వ్యక్తిని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసే విషయంలో ఆదివారం తెల్లవారుజామున వివాదం చెలరేగింది. కళ్యాణ్లోని రిలీఫ్ ఆసుపత్రి కారిడార్లలో మొదలైన గొడవ క్రమంగా ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించి పాల్ఘర్ పోలీసులు కనీసం 17 మందిపై కేసు నమోదు చేశారు. వీరిలో ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గానికి చెందిన కొందరు సభ్యులు కూడా ఉన్నారు. సీసీటీవీ ఫుటేజీలో ఓ నిందితుడు రిసెప్షనిస్ట్ను చెంపదెబ్బ కొట్టినట్లు కనిపించింది. ఘటనలో జోక్యం చేసుకునేందుకు ప్రయత్నించిన ఓ మహిళా ఉద్యోగిని కూడా నిందితుడు బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆసుపత్రి ఉద్యోగి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. శివసేన జిల్లా అధ్యక్షుడు కుందన్ సాంకే, నగర అధ్యక్షుడు రాహుల్ ఘరత్ సహా పలువురు ఆసుపత్రి అత్యవసర విభాగంలోకి ప్రవేశించి.. గాయపడిన వ్యక్తిని డిశ్చార్జ్ చేయడంపై వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం తీవ్రరూపం దాల్చడంతో ఆసుపత్రి సిబ్బందిపై కూడా దాడి జరిగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
డాక్టర్లపై దాడులను తేలిగ్గా తీసుకోలేం
శాస్త్రినగర్ ఆసుపత్రిలో వైద్యులపై జరిగిన దాడికి సంబంధించి శివసేన కార్పొరేటర్ రమేశ్ సుక్ర్యా మ్హాత్రేను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఆసుపత్రుల్లో వైద్య నిపుణులపై జరిగే దాడులను ఏమాత్రం తేలిగ్గా తీసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది. రాజకీయ పార్టీలకు చెందిన వ్యక్తులు వైద్యులపై దాడులకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఇలాంటి వారిని అదుపులోకి తీసుకుని, స్వేచ్ఛగా తిరగకుండా చూడాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

