పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో సంక్షోభం నెలకొంది. ఆయా దేశాలు ఇప్పటికే పొదుపు మంత్రం పాటిస్తున్నాయి. ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. ప్రధాని మోడీ దగ్గర నుంచి కేంద్రమంత్రులు, రాష్ట్రాలు పొదుపు మంత్రం పాటించక తప్పడం లేదు. ఇప్పటికే మోడీ కాన్వాయ్ సగానికి సగం తగ్గిపోయింది. అలాగే రాష్ట్రాల ముఖ్యమంత్రుల పరిస్థితి కూడా ఇంతే. ఇక కేంద్రమంత్రులు ప్రజా రవాణాను ఉపయోగిస్తున్నారు. విదేశీ మారక నిల్వలు అయిపోవడం.. నిలిచిపోవడంతో దేశంలో సంక్షోభం తలెత్తాయి. దీంతో దేశ పౌరులంతా పొదుపు మంత్రం పాటించాలని భారత ప్రభుత్వం ఆదేశించింది.
తాజాగా దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ కోవలోకి వచ్చేసింది. తాజా పరిణామాల నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై వర్చువల్ విచారణలకు సుప్రీంకోర్టు ఆదేశించింది. రిజిస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ విచారణలు కేవలం సోమ, శుక్రవారాల్లో మాత్రమే నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని సీజేఐ సూర్యకాంత్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా దాడి చేశాయి. ఈ ఘటనలో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ అయతుల్లా ఖమేనీ హతమయ్యారు. అనేక మంది ప్రభుత్వ పెద్దలు కూడా చనిపోయారు. దీనికి ప్రతీకారంగా ఇరాన్ గల్ఫ్ దేశాలపై దాడులు చేసింది. అంతేకాకుండా హార్ముజ్ జలసంధిని కూడా మూసేసింది. దీంతో ప్రపంచ దేశాలకు వెళ్లే నౌకలు నిలిచిపోయాయి. దీంతో చమురు, గ్యాస్ కష్టాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో పొదుపు మంత్రం పాటిస్తుండగా.. ప్రస్తుతం భారత్లో అమలవుతోంది.
