Supreme Court: పెళ్లికి ముందు ఇద్దరు అవివాహితైన మేజర్ల మధ్య పరస్పర సమ్మితితో శారీరక సంబంధం ఏర్పడితే దానిని తప్పుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడించింది. ఇది ఒక వ్యక్తి వ్యక్తిత్వానికి మచ్చగా చెప్పలేమని వ్యాఖ్యానించింది. తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ నియామకానికి సంబంధించిన కేసులో అత్యున్నత న్యాయస్థానం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. జస్టిస్ మన్మోహన్, జస్టిన్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.
2014లో పెళ్లి చేసుకుంటానని హామీ ఇచ్చి శారీరకం సంబంధం పెట్టుకున్నాడని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. తెలంగాలలో గాజుల తిరుపతి అనే వ్యక్తి ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్గా ఎంపికవ్వగా, 2014లో ఒక మహిళతో వివాహేత సంబంధం పెట్టుకున్నాడనే కారణంగా అతడికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఈ కేసులో అతడిపై క్రిమినల్ కేసు నమోదైంది. దీని తర్వాత 2015లో ఈ కేసు లోక్ అదాలత్లో రాజీకి వచ్చింది. ఈ కేసు కారణంగా తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అతడి కానిస్టేబుల్ ఎంపికను రద్దు చేసింది.
ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సదరు అభ్యర్థి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు అవివాహిత పెద్దలు తమ ఇష్టప్రకారం సంబంధం కొనసాగించడాన్ని నిషేధించే చట్టం ఏదీ లేదని స్పష్టం చేసింది. కేవలం అలాంటి సంబంధం కారణంగా వ్యక్తి నైతికత, వ్యక్తిత్వాన్ని ప్రశ్నించలేమని చెప్పింది. ప్రతీ ప్రేమ సంబంధం కూడా వివాహంతోనే ముగియాల్సిన అవసరం లేదని సుప్రీం వ్యాఖ్యానించింది. పెళ్లి కానంత మాత్రాన సంబంధంలో మోసం చేశాడని భావించలేమని చెప్పింది. లోక్ అదాలత్లో రాజీకి రావడం అంటే నేరాన్ని అంగీకరించినట్లు కాదని కోర్టు స్పష్టం చేసింది.
ఈ కేసులో ఇద్దరు కూడా ఒకరికి ఒకరు తెలుసని, పొరుగువారని కోర్టు గమనించింది. బలవంతంగా, బెదిరించి, ఒత్తిడి చేసి రిలేషన్ కొనసాగించారనే ఆధారాలు లేవని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ కేసులో రిక్రూట్మెంట్ బోర్డు తీసుకున్న రద్దు నిర్ణయాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. తగిన ఆధారాలు లేకుండా వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రశ్నించడం సరికాదని పేర్కొంది.

