దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హనీమూన్ మర్డర్ కేసు మరోసారి సంచలనంగా మారింది. ఈ వ్యవహారం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సోనమ్ రఘువంశీకి మేఘాలయ హైకోర్టు బెయిల్ మంజూర్ చేయడాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం ధర్మాసనాన్ని ఆశ్రయించింది. బెయిల్ మంజూరు చేస్తూ మేఘాలయ హైకోర్టు ఇచ్చిన తీర్పును వెంటనే రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది.
ఈ పిటిషన్పై గురువారం జస్టిస్ ఎం.ఎం. సుందరేశ్, జస్టిస్ శీల్ నాగులతో కూడిన ధర్మాసనం ముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలికి హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం తప్పిదమని, అత్యవసరంగా విచారణ చేపట్టాలని కోర్టును కోరారు. అరెస్టు సమయంలో సోనమ్కు అరెస్టుకు సంబంధించిన పూర్తి కారణాలను అందించలేదనే కారణంతోనే బెయిల్ మంజూరైందని తుషార్ మెహతా తెలిపారు. అయితే పత్రాల్లో ఒక నిబంధనను ప్రస్తావించే సమయంలో టైపోగ్రాఫికల్ పొరపాటు మాత్రమే జరిగిందని.. అది చట్టపరంగా పెద్ద లోపం కాదని వాదించారు. అంతేకాకుండా బెయిల్పై విడుదలైతే నిందితురాలు పరారయ్యే అవకాశం ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం శుక్రవారం విచారణకు కేసును జాబితాలో చేర్చేందుకు అంగీకరించింది.
ఇదిలా ఉండగా జూన్ 29న మేఘాలయ హైకోర్టు… ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను సమర్థిస్తూ సోనమ్ రఘువంశీకి బెయిల్ మంజూరు చేసింది. గతేడాది మే 23న హనీమూన్ కోసం మేఘాలయలోని సోహ్రా ప్రాంతానికి వెళ్లిన రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ అదృశ్యమయ్యారు. అనంతరం 2025 జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లోతైన లోయలో లభ్యమైంది. ప్రియుడి కోసం హంతకులతో కలిసి భర్త హత్యకు సోనమ్ రఘువంశీ కుట్ర పన్నినట్లు పోలీసులు ఆరోపించారు. మరోవైపు సోనమ్ బెయిల్ మంజూరు చేయడంపై బాధిత కుటుంబం అభ్యంతరం వ్యక్తం చేసింది. భర్తను చంపిన వ్యక్తికి ఎలా మంజూరు చేస్తారని న్యాయస్థానాలను ప్రశ్నించారు.

