దేశవ్యాప్తంగా పాదచారుల భద్రతకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. రోడ్ల పక్కన సక్రమంగా గుర్తించిన, నిర్వహించిన ఫుట్పాత్లపై నడిచే హక్కు భారత పౌరుల ప్రాథమిక హక్కు అని స్పష్టం చేసింది. అంతేకాకుండా మోటారు వాహనాల రాకపోకల కంటే పాదచారుల హక్కుకే ప్రాధాన్యం ఉండాలని పేర్కొంది. ఈ హక్కును రక్షించేందుకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది.
జస్టిస్ పి.ఎస్. నరసింహ నేతృత్వంలోని ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. “ఒక రహదారి ఉంటే దాని వెంట ఫుట్పాత్ను ఏర్పాటు చేసి నిర్వహించడం ప్రభుత్వాల బాధ్యత. ఇది కేవలం పరిపాలనా బాధ్యత మాత్రమే కాదు. అమలు చేయదగిన చట్టబద్ధ బాధ్యత కూడా. ఫుట్పాత్పై నడిచే ప్రాథమిక హక్కు మోటారు వాహనాల ప్రయాణ హక్కుపై ఆధిక్యం కలిగి ఉంటుంది” అని తీర్పులో పేర్కొన్నారు. ఈ కేసు ఓ విషాద ఘటన నేపథ్యంలో సుప్రీంకోర్టు ముందుకు వచ్చింది. తన తండ్రితో కలిసి పాఠశాలకు నడుచుకుంటూ వెళ్తున్న ఐదేళ్ల బాలుడు ట్రక్ ఢీకొని మృతి చెందాడు. ఈ ఘటనపై విచారణ సందర్భంగా పాదచారుల భద్రత అంశాన్ని కోర్టు సీరియస్గా తీసుకుని విచారించింది.
తీర్పులో జస్టిస్ నరసింహ మాట్లాడుతూ.. “భయాందోళనలు లేకుండా విశాలమైన ఫుట్పాత్పై నడవడం ప్రతి మనిషికి అత్యంత ప్రాథమిక హక్కు. నడక అనేది జీవితంతో విడదీయరాని మానవ కార్యకలాపం” అని వ్యాఖ్యానించారు. భారత రాజ్యాంగంలోని స్వేచ్ఛగా సంచరించే హక్కు (Article 19)లో భాగంగానే నడిచే హక్కు కూడా అంతర్భాగమని పేర్కొన్నారు. అయితే కాలక్రమేణా ఆర్థిక అభివృద్ధి, పట్టణీకరణ, వాణిజ్య అవసరాల కారణంగా పాదచారుల అవసరాలను ప్రభుత్వాలు విస్మరించాయని కోర్టు విమర్శించింది. రహదారులు, ఎక్స్ప్రెస్వేలు నిర్మాణానికి ప్రాధాన్యం ఇచ్చినా.. ఫుట్పాత్ల ఏర్పాటుపై తగిన శ్రద్ధ చూపలేదని పేర్కొంది. దీంతో పాదచారులు రోడ్లపై ఇబ్బందులకు గురవుతూ, ప్రమాదాలకు బలవుతున్నారని ఆందోళన వ్యక్తం చేసింది.
“ఒకప్పుడు వాహనాలు ధనికులకే పరిమితమయ్యాయి. కానీ కాలక్రమేణా వాహనాల సంఖ్య పెరిగి రోడ్లపై ఆధిపత్యం చెలాయించాయి. ఫలితంగా నడిచే వారిని ఇబ్బందిగా చూసే పరిస్థితి ఏర్పడింది. ఫుట్పాత్లపై కూడా వాహనాలు దూసుకెళ్లడం, పాదచారులు ప్రమాదాలకు గురవడం సాధారణమైంది. ఇకపై ఇది కొనసాగకూడదు” అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
భారత స్వాతంత్ర్య ఉద్యమం, సామాజిక సంస్కరణలు, రాజకీయ చైతన్యంలో నడకకు ప్రత్యేక స్థానం ఉందని కోర్టు గుర్తు చేసింది. “నడక అనేది కేవలం ప్రయాణం కాదు. అది నిరసన, ఆలోచన, సామాజిక చైతన్యం, ప్రజాస్వామ్య హక్కుల ప్రతీక. మహాత్మా గాంధీ వంటి నాయకుల ఉద్యమాల్లో నడక కీలక పాత్ర పోషించింది” అని వ్యాఖ్యానించింది. మోటారు వాహనాల చట్టం (Motor Vehicles Act, 1988) పాదచారుల హక్కులను సరైన రీతిలో గుర్తించలేదని కోర్టు అభిప్రాయపడింది. ప్రస్తుతం ఉన్న చట్టాలు వాహనాలను కేంద్రంగా చేసుకుని రూపొందించబడ్డాయని.. పాదచారుల ప్రయోజనాలు ద్వితీయ స్థాయిలోనే ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో పాదచారుల హక్కులను రక్షించేందుకు ప్రత్యేక చట్టం అవసరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఆ చట్టం ద్వారా బాధ్యత వహించాల్సిన సంస్థలను గుర్తించడం, హక్కుల ఉల్లంఘనలకు తక్షణ పరిష్కారాలు అందించడం, అమలును పర్యవేక్షించే ప్రత్యేక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయాలని సూచించింది.
అంతేకాకుండా ఈ తీర్పు ప్రతిని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, రహదారుల రవాణా శాఖలకు పంపాలని రిజిస్ట్రీకి ఆదేశించింది. అలాగే పాదచారుల హక్కుల పరిరక్షణకు అవసరమైన చట్టపరమైన వ్యవస్థపై అధ్యయనం చేయాలని భారత న్యాయ సంఘం (Law Commission of India)కు సూచించింది.
ఈ కేసులో మృత బాలుడి కుటుంబానికి రూ.11 లక్షలకు పైగా పరిహారం చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. “ఉదయం తన కుమారుడిని ప్రేమగా పాఠశాలకు తీసుకెళ్లిన తండ్రికి అది తన కుమారుడితో చివరి నడక అవుతుందని ఊహించలేదు” అంటూ జస్టిస్ నరసింహ తన సంతాపాన్ని వ్యక్తం చేశారు.

