Supreme Court: 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు.. కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన

  • 9వ తరగతిలో మూడో భాష రుద్దొద్దు
  • కేంద్రానికి సుప్రీంకోర్టు సూచన
  • 6వ తరగతి నుంచే బోధించాలని హితవు
Supreme Court

Supreme Court

సీబీఎస్ఈ పాఠ్యప్రణాళికలో భాగంగా 9వ తరగతి స్థాయిలో మూడో భాషను ప్రవేశపెట్టడం వల్ల బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులపై అదనపు ఒత్తిడి పడుతుందని సుప్రీంకోర్టు గురువారం ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి జిల్లాలో జవహర్ నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పించాలని ఆదేశిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుకు వ్యతిరేకంగా తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీలుపై సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ సందర్భంగా జస్టిస్ బీవీ నాగారత్న పలు కీలక వ్యాఖ్యలు చేశారు. 9వ తరగతిలో కొత్తగా మూడో భాషను ప్రవేశపెట్టడం విద్యార్థులపై అదనపు ఒత్తిడిని పెంచుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. బోర్డు పరీక్షలకు సిద్ధమయ్యే దశలో కొత్త భాషను నేర్పడం సరికాదని పేర్కొంది. దీనికి బదులు 6వ తరగతి నుంచే మూడో భాషను బోధించడం మంచిదని సూచించింది.

9వ తరగతిలో కొత్త భాష ఎందుకు?

ఈ కేసులో మూడు భాషల విధానం చట్టబద్ధత నేరుగా విచారణలో లేకపోయినా.. జస్టిస్ బీవీ నాగరత్న విధానం అమలు చేస్తున్న సమయంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘9వ తరగతి విద్యార్థులకు చాలా ఒత్తిడితో కూడుకున్న దశ. అలాంటి సమయంలో కొత్త భాషను ఎందుకు ప్రవేశపెడుతున్నారు? అవసరమైతే 6వ తరగతి నుంచే ప్రారంభించండి.” అని బీవీ నాగారత్న అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి ‘‘కేంద్ర ప్రభుత్వం దయచేసి 9వ తరగతిలో మూడో భాషను ప్రవేశపెట్టొద్దు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, రాష్ట్ర బోర్డుల్లో 10వ తరగతి బోర్డు పరీక్ష ఉంటుంది. 8వ తరగతి పూర్తయ్యే సమయం నుంచే విద్యార్థులపై ఒత్తిడి ప్రారంభమవుతుంది.’’ అని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా విద్యార్థి దశలో ఎదురైన ఇబ్బందులను ఈ సందర్భంగా జస్టిస్ నాగరత్న గుర్తుచేశారు. తాము చదివినప్పుడు… మధ్య తరగతుల్లోనే మూడో భాషను బోధించేవారని తెలిపారు. ‘‘మా కాలంలో మిడిల్ స్కూల్ నుంచే మూడో భాష ప్రారంభమయ్యేది. హిందీ రెండో భాషగా ఉంటే కన్నడను, కన్నడ రెండో భాషగా ఉంటే హిందీని మూడో భాషగా నేర్పేవారు. సంస్కృతం కూడా ఒక ఎంపికగా ఉండేది. ఎంత ముందుగానే నేర్పితే అంత మంచిది.’’ అని అన్నారు.

హిందీ తప్పనిసరి కాదు

విచారణ సందర్భంగా జస్టిస్ నాగరత్న మరో కీలక అంశాన్ని స్పష్టం చేశారు. జాతీయ విద్యా విధానంలోని మూడు భాషల విధానం ప్రకారం మూడో భాషగా హిందీని తప్పనిసరిగా చదవాలనే నిబంధన లేదని పేర్కొన్నారు. ‘‘రాష్ట్ర భాష, ఇంగ్లీష్ తప్పనిసరిగా ఉండాలి. మూడో భాషగా ఏదైనా భాషను ఎంపిక చేసుకోవచ్చు. హిందీనే చదవాలని ఎక్కడా చెప్పలేదు.’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా సీబీఎస్ఈ మూడు భాషల విధానాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు ప్రజాహిత వ్యాజ్యాలు ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ముందున్నాయి. ఈ విధానం అమలుపై స్టే ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించగా, వచ్చే వారం ఈ అంశంపై తదుపరి విచారణ జరగనుంది.