మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి సునేత్ర పవార్పై కాంగ్రెస్ చేసిన ‘గూంగీ గుడియా’ వ్యాఖ్యలు రాజకీయ దుమారానికి దారితీశాయి. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. మంగళవారం ముంబైలోని మహారాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహిస్తున్న మీడియా సమావేశంలోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ క్షమాపణ చెప్పాలని ఎన్సీపీ నేతలు డిమాండ్ చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ (మూగ బొమ్మ) అని సంబోధించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
సోమవారం కాంగ్రెస్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక వీడియోను షేర్ చేసిన తర్వాత ఈ వివాదం ప్రారంభమైంది. బీడ్ జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితిపై ఓ జర్నలిస్ట్ సునేత్ర పవార్ను ప్రశ్నించేందుకు ప్రయత్నించగా.. ఎన్సీపీ నేత ధనంజయ్ ముండే ఆమెకు అడ్డుగా నిలిచినట్లు ఆ వీడియోలో కనిపించిందని కాంగ్రెస్ పేర్కొంది. అనంతరం సునేత్ర పవార్ను ‘గూంగీ గుడియా’ అంటూ కాంగ్రెస్ సోషల్ మీడియాలో వ్యాఖ్యానించింది.
సునేత్ర పవార్ బీడ్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ‘‘సునేత్ర పవార్.. ఇంకెన్ని రోజులు ‘గూంగీ గుడియా’గా ఉంటారు?’’ అంటూ కాంగ్రెస్ తన సోషల్ మీడియా పోస్టులో ప్రశ్నించింది. దీంతో ఎన్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో దివంగత ప్రధాని ఇందిరాగాంధీని విమర్శించేందుకు ఉపయోగించిన ఈ పదాన్ని ఇప్పుడు కాంగ్రెస్ సమర్థిస్తోందా అని ప్రశ్నించింది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కూడా కాంగ్రెస్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. మహారాష్ట్ర తొలి మహిళా ఉప ముఖ్యమంత్రిపై ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు కాంగ్రెస్ సిగ్గుపడాలని అన్నారు. సునేత్ర పవార్ను అవమానించడం అంటే రాష్ట్రంలోని మహిళలందరినీ అవమానించినట్లేనని వ్యాఖ్యానించారు.
‘గూంగీ గుడియా’ వ్యాఖ్యలపై రాజకీయ వివాదం చెలరేగినప్పటికీ.. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కాల్ మాత్రం ఆ వ్యాఖ్యలను సమర్థించారు. అది దూషణ కాదని, ప్రజా వేదికలపై సునేత్ర పవార్ ప్రవర్తనకు సంబంధించిన వివరణ మాత్రమేనని పేర్కొన్నారు. బీడ్లో జరిగిన మీడియా సమావేశంలో జర్నలిస్టులు వరుసగా ప్రశ్నలు అడిగినప్పటికీ.. సునేత్ర పవార్ ఏ అంశంపైనా స్పందించలేదని సప్కాల్ ఆరోపించారు. అక్కడ ఉన్న ఒక వ్యక్తి ధనంజయ్ ముండే జర్నలిస్టులను ప్రశ్నలు అడగకుండా అడ్డుకునేందుకు ప్రయత్నించారని అన్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న సునేత్ర పవార్ ఆ విషయంపై కూడా స్పందించలేదని పేర్కొన్నారు. ‘‘గూంగీ గుడియా’ అనేది తిట్టా? అది కేవలం ఒక వివరణ మాత్రమే. సునేత్ర పవార్ ప్రవర్తనకు ఈ పోలిక వర్తిస్తుంది’’ అని హర్షవర్ధన్ సప్కాల్ వ్యాఖ్యానించారు.
ఇందిరాగాంధీని గుర్తు చేసిన ఎన్సీపీ
కాంగ్రెస్ వ్యాఖ్యలపై ఎన్సీపీ అధికార ప్రతినిధి ఉమేష్ పాటిల్ తీవ్రంగా స్పందించారు. దివంగత ప్రధాని ఇందిరాగాంధీపై గతంలో చేసిన విమర్శలు సరైనవేనని కాంగ్రెస్ ఇప్పుడు పరోక్షంగా అంగీకరిస్తోందా అని ప్రశ్నించారు. ‘‘ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయాలు, ప్రభుత్వ విధానాలపై తీవ్రమైన విమర్శలు ఉండొచ్చు. కానీ మహిళలను కించపరిచే భాషను ఉపయోగించడం ఏ రాజకీయ పార్టీకి తగదు’’ అని ఉమేష్ పాటిల్ అన్నారు. ‘గూంగీ గుడియా’ అనే పదాన్ని కాంగ్రెస్ వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజా రాజకీయ చర్చల్లో గౌరవం, మర్యాదను కాపాడే సంప్రదాయాన్ని కాంగ్రెస్ కొనసాగించాలని కోరారు.
ఈ వివాదంపై ఎన్సీపీ (ఎస్పీ) నేత, సునేత్ర పవార్ మేనల్లుడు రోహిత్ పవార్ కూడా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సందర్భాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. ‘‘ఓ జర్నలిస్ట్ సునేత్ర పవార్ను ప్రశ్న అడగాలని ప్రయత్నించారు. అయితే స్థానిక నేత ఒకరు అతడిని తన పని చేయకుండా అడ్డుకున్నారు. ఆ అన్యాయాన్ని అడ్డుకునే అధికారం ఉన్నప్పటికీ సునేత్ర పవార్ మౌనంగా ఉన్నారు’’ అని రోహిత్ పవార్ వ్యాఖ్యానించారు.
దివంగత ప్రధాని ఇందిరాగాంధీని విమర్శించిన వారు గతంలో ‘గూంగీ గుడియా’ అనే పదాన్ని ఉపయోగించారని రోహిత్ పవార్ గుర్తు చేశారు. అయితే ఇందిరాగాంధీ తన పనితీరుతో ఆ విమర్శలను తప్పని నిరూపించారని పేర్కొన్నారు. సునేత్ర పవార్పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదానికి దారితీశాయి. ఒకవైపు కాంగ్రెస్ తన వ్యాఖ్యలను సమర్థిస్తుండగా.. మరోవైపు ఎన్సీపీ ఆ పదాలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది. ఈ వివాదం రానున్న రోజుల్లో మరింత రాజకీయ వేడిని పెంచే అవకాశం కనిపిస్తోంది.
सुनेत्रा पवार, अजून किती दिवस “गुंगी गुडिया” बनून राहतील ! pic.twitter.com/1Cgj9dZfBq
— Maharashtra Congress (@INCMaharashtra) August 3, 2026

