Congress: నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతోంది. మరోవైపు, ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ ఆస్పత్రిలో తన నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉంటే, కాంగ్రెస్ నిరసనలపై వాంగ్చుక్ భార్య గీతాంజలి ఆంగ్మో తీవ్ర విమర్శలు చేశారు. ప్రధాని నరేంద్రమోడీ నివాసం ముందు ధర్నా చేయడాన్ని తప్పుపట్టారు. కాంగ్రెస్ నిరసన తీవ్రమైంది కాదని, దానికి బదులుగా కాంగ్రెస్ నాయకులు జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల్ని కలిసి ఉండాల్సిందని ఆమె అన్నారు. జాతీయ మీడియాకు ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
ప్రధాని మోడీ ఇంటి ముందు జరిగిన నిరసనల్లో చిత్తశుద్ధి లేదని, ఇది ప్రజల్ని మోసగించడమే అని, నిజాయితీ లేని వారిని యువత తరిమేస్తుందని ఆమె అన్నారు. సోమవారం పార్లమెంట్ మార్చ్ సందర్భంగా పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. అయితే, ఈ అణచివేతకు నిరసనగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇతర కీలక నేతలు ప్రధాని మోడీ నివాసం ముందు మెరుపు ధర్నా చేశారు.
విద్యార్థి ఉద్యమం పూర్తిగా రాజకీయాలకు అతీతమని ఆమె అన్నారు. ఈ ఉద్యమం ద్వారా రాజకీయ నాయకులకు మాటలు కాదు, చేతలు కావాలనే సందేశాన్ని ఇచ్చిందని చెప్పారు. మాకు ప్రభుత్వం, ప్రతిపక్షం అనే తేడా లేదని, పార్లమెంటే అత్యున్నత సంస్థ, విద్యాను ప్రాథమిక అంశంగా పార్లమెంట్ పరిగణించాలని అన్నారు. రాజకీయాల కోసం ఉద్యమాన్ని వాడుకోవద్దని సూచించారు.

