Sonam wangchuk: జంతర్ మంతర్ వద్ద 20 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ను శనివారం ఉదయం పోలీసులు సఫ్దర్జంగ్ ఆస్పత్రికి తరలించారు. అయితే, వైద్యుల చికిత్సకు ఆయన నికారిస్తున్నట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది. వాంగ్చుక్ డీహైడ్రేషన్, సీరం పొటాషియం లోపం, కాంపెన్సెడెట్ అసిడోసిన్, కీటోన్ స్థాయిలు పెరిగినట్లు పరీక్షల్లో తేలింది. ఉదయం ఆయన మూత్రంతో కీటోన్ స్థాయి 1+గా ఉండగా, మధ్యాహ్నానికి ఇది 3కి పైగా పెరిగిందని వైద్యులు తెలిపారు. ఆసుపత్రిలో చేర్చే సమయానికి, అతను పూర్తి స్పృహలో ఉన్నాడు, రక్తపోటు, నాడి, ఆక్సిజన్ సాచురేషన్ లెవల్స్ సాధారణంగా ఉన్నాయని చెప్పారు. షుగర్ 78 mg/dlగా ఉన్నట్లు హెల్త్ బులెటిన్ వెల్లడించింది.
సోనమ్ వాంగ్చుక్కు ఐవీ ఫ్లూయిడ్స్, ఓఆర్ఎస్, ఇతర మందులు ఇవ్వాలని వైద్యులు సూచించినప్పటికీ ఆయన ప్రస్తుతం చికిత్స తీసుకోవడానికి అంగీకరించడం లేదని ఆస్పత్రి పేర్కొంది. అయినప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. దీర్ఘకాలిక నిరాహార దీక్షలో కీటోన్ స్థాయిలు పెరగడం సాధారమే అయినా, డీహైడ్రేషన్తో ఇది కొనసాగితే కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందని చెబుతున్నారు. అలాగే శరీర జీవక్రియపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే వాంగ్చుక్ భార్య గీతాంజలి జే. ఆంగ్మో సఫ్ధర్జంగ్ ఆస్పత్రికి లేఖ రాశారు. తమ అనుమతి లేకుండా ఆయనకు ఎలాంటి మందులు, ద్రవాలు ఇవ్వొద్దని కోరారు. ఆయనను మరో ఆస్పత్రికి తరలించాలని విజ్ఞప్తి చేశారు.
నీట్ పేపర్ లీక్కు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనమ్ వాంగ్చుక్ నిరాహార దీక్ష చేపట్టారు. కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఇదే డిమాండ్ చేస్తోంది. జూలై 20న వీరు ‘‘పార్లమెంట్ మార్చ్’’కు పిలుపునిచ్చారు. జూన్ 28 నుంచి నిరాహార దీక్షలో ఉన్న వాంగ్చుక్ ఇప్పటి వరకు సుమారు 9.5 కిలోల బరువు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు.

