మధ్యప్రాచ్యం యుద్ధం కారణంగా ఏర్పడిన సంక్షోభంపై రేపు సాయంత్రం 6:30 గంటలకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పలు కీలక సూచనలు చేయనున్నారు. సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలన్నదానిపై దిశానిర్దేశం చేయనున్నారు.

అయితే ఈ సమావేశానికి పలువురు ముఖ్యమంత్రులు దూరంగా ఉండనున్నారు. ప్రస్తుతం దేశంలో ఐదు రాష్ట్రాల్లో మినీ ఎన్నికల సమరం జరుగుతోంది. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల కోడ్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడీ నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్కు ముఖ్యమంత్రులు ఎంకే.స్టాలిన్, మమతా బెనర్జీ, పినరయి విజయన్, హిమంత బిశ్వ శర్మ దూరంగా ఉండనున్నారు. ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల కోసం కేబినెట్ సెక్రటేరియట్ ద్వారా ఒక ప్రత్యేక సమావేశం నిర్వహించబడుతుందని ఒక కేంద్ర అధికారి తెలిపారు.

ఇక పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా రాష్ట్రాల సన్నద్ధత, ప్రణాళికలను మోడీ సమీక్షించనున్నారు. ‘‘టీమిండియా’’ స్ఫూర్తితో అన్ని ప్రయత్నాల్లో సమన్వయం ఉండేలా చూడటమే ఈ సమావేశం ఉద్దేశం. అంతకుముందు కేంద్ర ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి సలహాలు తీసుకుంది.