Site icon NTV Telugu

Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

Madan Dilawar

Madan Dilawar

Rajasthan: రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి, బీజేపీ నేత మదన్ దిలావర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ‘గిరిజనులకు డీఎన్ఏ పరీక్ష’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష కాంగ్రెస్ మండిపడుతోంది. భారతీయ ఆదివాసీ పార్టీ(బీఏపీ), రాజస్థాన్ గిరిజన సంఘాలు కూడా మంత్రి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించాయి. కోటాలోని రామ్ గంజ్ మండికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే, మంత్రి దిలావర్..‘‘ గిరిజనులు హిందువులు కాదని’’ బీఏపీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ డీఎన్ఏ వ్యాఖ్యలు చేశారు.

Read Also: UP: మాయావతి దిద్దుబాటు చర్యలు.. వారసుడిగా తిరిగి మేనల్లుడు నియామకం

దిలావర్ మాట్లాడుతూ.. ‘‘వారు హిందువులా కాదా అనేది వారి పూర్వీకులను అడుగుతామే. వాళ్లను కలుసుకుని మేము వారి వంశవృక్షాన్ని నమోదు చేస్తాము. వారు హిందువులు కాకుంటే డీఎన్ఏ పరీక్ష నిర్వహించి, వారు వారి తండ్రుల పిల్లలు అవునా..కాదా అనే దాన్ని తేలుస్తాము’’ అని అన్నారు. ఈ ప్రకటన తర్వాత ప్రతిపక్ష పార్టీ నేతలు గిరిజనులు తమ రక్తనమూనాలను సీఎం భజన్ లాల్‌కి పంపాలని కోరుతూ ప్రచారాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. దిలావర్ గిరిజన సమాజాన్ని అవమానించారని బన్స్వారా లోక్‌సభ ఎంపీ రాజ్‌కుమార్ రోట్ అన్నారు. ఆయన క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోవింద్ సింగ్ దోతస్రా దిలావర్‌ను “మానసిక రోగి”గా అభివర్ణించారు. గిరిజనులపై ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు.

Exit mobile version