Site icon NTV Telugu

RN Ravi: ఎన్నికల వేళ బిగ్ ట్విస్ట్.. బెంగాల్ గవర్నర్‌గా ఆర్ఎన్.రవి ప్రమాణస్వీకారం

Rnravi

Rnravi

తమిళనాడు గవర్నర్‌గా పనిచేసిన ఆర్‌ఎన్ రవి.. పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం 11:30 గంటలకు కోల్‌కతాలోని రాజ్‌‌భవన్‌లో ఆర్ఎన్.రవి ప్రమాణస్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజోయ్ పాల్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాన కార్యదర్శి నందిని చక్రవర్తి, అసెంబ్లీ స్పీకర్ బిమాన్ బెనర్జీ, లెఫ్ట్ ఫ్రంట్ చైర్మన్ బిమాన్ బసు తదితరులు హాజరయ్యారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికల వేళ తమిళనాడు గవర్నర్‌గా పని చేసిన రవి.. బెంగాల్‌కు పంపించడం పొలిటికల్‌గా ఆసక్తి రేపుతోంది. నిన్నామొన్నటిదాకా తమిళనాడులో ముఖ్యమంత్రి స్టాలిన్ సర్కార్‌తో నిత్యం గవర్నర్ రవి మధ్య విభేదాలు నడుస్తూనే ఉన్నాయి. ఇటీవల బడ్జెట్ సమావేశాల్లో ప్రసంగించకుండా అర్ధాంతరంగా వెళ్లిపోయారు. త్వరలో బెంగాల్‌లో ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో రవిని బెంగాల్‌కు పంపించడం పొలిటికల్ సర్కిల్‌లో ఆసక్తికర చర్చ సాగుతోంది.

బెంగాల్ గవర్నర్‌గా ఉన్న సీవీ ఆనంద్ బోస్ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. దీంతో రవికి పశ్చిమ బెంగాల్ శాశ్వత గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. చాలా కాలం తమిళనాడు గవర్నర్‌గా ఉన్నారు. తమిళనాడు గవర్నర్‌గా ఉన్న కాలంలో రవి పదేపదే డీఎంకె ప్రభుత్వంతో ఘర్షణ పడుతూనే ఉన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా వివిధ బిల్లులపై స్టాలిన్ ప్రభుత్వంతో వివాదం నడిచింది. గవర్నర్‌ను తొలగించాలని స్టాలిన్ సర్కార్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కూడా పిటిషన్ వేసింది. అనూహ్యంగా రవిని పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా పంపించింది.

ఇదిలా ఉంటే సీవీ ఆనంద్ బోస్ గవర్నర్ పదవికి అకస్మాత్తుగా రాజీనామా చేయడాన్ని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రశ్నించారు. తమిళనాడు గవర్నర్ రవి పేరును తదుపరి గవర్నర్‌గా ప్రకటించిన వెంటనే మమత సోషల్ మీడియాలో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ ఆకస్మిక రాజీనామా వార్తతో నేను షాక్ అయ్యాను. తీవ్ర ఆందోళన చెందాను. ప్రస్తుతానికి రాజీనామాకు కారణం నాకు తెలియదు. అయితే ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొన్ని రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి గవర్నర్ కేంద్ర హోంమంత్రి నుంచి ఒత్తిడిలో ఉన్నారని తెలిసి ఆశ్చర్యపోను.’’ అని రాసుకొచ్చారు.

Exit mobile version