Bihar Elections: తేజస్వీ యాదవ్ గెలిస్తే “వక్ఫ్ చట్టాన్ని” రద్దు చేస్తారు.. ఆర్జేడీ హామీపై బీజేపీ ఫైర్..

  • తేజస్వీ యాదవ్ గెలిస్తే వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తారు..
  • వివాదాస్పదంగా మారిన ఆర్జేడీ నేత కామెంట్స్..
  • జంగిల్ రాజ్ లక్షణాలు కనిపిస్తున్నాయని బీజేపీ ఆగ్రహం..
Rjd

Rjd

Bihar Elections: బీహార్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీలు ప్రచారాన్ని ఉద్ధృతం చేశాయి. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ రెండు విడతల్లో నవంబర్ 6, నవంబర్ 11న పోలింగ్ జరుగనుంది. నవంబర్ 14న బీహార్ ఫలితాలు వెలువడనున్నాయి. అయితే, ఇప్పుడు ఆర్జేడీ నేత, ఎంఎల్సీ ఖారీ సోహైబ్ చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. ఆర్జేడీ పార్టీ అభ్యర్థి డాక్టర్ సంజీవ్ కుమార్ ప్రచార ర్యాలీలో మాట్లాడుతూ.. ‘‘తేజస్వీ యాదవ్ ముఖ్యమంత్రి అయితే, వక్ఫ్ చట్టాన్ని రద్దు చేస్తారు. వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చిన వారికి తగిన విధంగా బుద్ధి చెబుతారు’’ అంటూ సోహైల్ అన్నారు.

Read Also: Jaanhvi Kapoor : పురుష అహంకారం.. హీరోలపై జాన్వీకపూర్ సంచలన కామెంట్స్

అయితే, ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా ఎక్స్ పోస్టులో.. ‘‘ ఆర్జేడీ నిజమైన స్వరూపం తెలిసింది. భూమిని దోచుకోవాలనే ఉద్దేశ్యం స్పష్టంగా ఉంది. జంగిల్ రాజ్ ఎలా ఉంటుందో అదే కనిపిస్తోంది’’ అని విమర్శించారు. కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు కూడా ఈ వ్యాఖ్యలపై మండిపడ్డారు. ‘‘ఎవరికి బుద్ధి చెప్పాలి. ఇవి జంగిల్ రాజ్ సంకేతాలు, దానిని అణిచివేయాలి’’ అని అన్నారు. కాంగ్రెస్, ఆర్జేడీ సుప్రీంకోర్టు, పార్లమెంట్‌ను గౌరవించవని, ప్రజాస్వామ్యాన్ని బహిరంగంగా అవమానిస్తాయని రిజిజు ఆరోపించారు. బీహార్ ప్రజలే వారికి బుద్ధి చెబుతారని అన్నారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో వక్ఫ్ సవరణ చట్టం-2025 అమలులోకి వచ్చింది. 1995 చట్టాన్ని సవరించి, వక్ఫ్ ఆస్తుల నిర్వహణ, పారదర్శకతను పెంచడానికి బీజేపీ సర్కార్ కొత్త చట్టాన్ని తీసుకువచ్చింది. వక్ఫ్ ఆస్తుల్ని డిజిటలైజ్ చేయడం, వక్ఫ్ బోర్డులో షియా, పాష్మాండా, బోహ్రా, ముస్లింయేతర వర్గాల మహిళలకు, సభ్యులను కూడా వక్ఫ్ బోర్డులో చేర్చడం వంటి నిబంధనల్ని తీసుకువచ్చింది. అయితే, కాంగ్రెస్, టీఎంసీ, డీఎంకే వంటి ప్రతిపక్ష పార్టీలు దీనిని మైనారిటీ వ్యతిరేక చర్యగా అభివర్ణించాయి.