NTV Telugu Site icon

Supreme court: చలో సెక్రటేరియట్‌ ఘటనలో బెంగాల్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

Rgkar

Rgkar

సుప్రీంకోర్టులో పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. కోల్‌కతా ఆర్‌జీ కర్‌ హాస్పిటల్‌ ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనపై విద్యార్థి సంఘాలు చేపట్టిన ‘చలో సెక్రటేరియట్‌’ నిరసనల్లో​ అరెస్టైన ‘పశ్చిమ్ బంగా ఛత్ర సమాజ్’ సంస్థ విద్యార్థి నాయకుడికి ఇటీవల కోల్‌కతా హైకోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ బెయిల్‌ను సవాల్ చేస్తూ బెంగాల్‌ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం సోమవారం కొట్టేసింది. ఈ సందర్భంగా బెంగాల్‌ ప్రభుత్వ తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం.. కేవలం ఒక్క సయన్ లాహిరినే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించింది. ‘‘ఇది బెయిల్ కేసు.. దీని గురించి ఎటువంటి సందేహం లేదు. పరిగణనలోకి తీసుకోవలసిన ఏకైక అంశం ఏమిటంటే.. ఈ ఉపశమనం మంజూరు చేయబడుతుందా లేదా అనేది తల్లి దాఖలు చేసిన రిట్ పిటిషన్‌లో ఉంది. అది చిన్న అంశం.’’ అని న్యాయస్థానం పేర్కొంది.

ఇది కూడా చదవండి: Singapore: ఈ దేశం చాలా చిన్నది.. కానీ పౌరుల తలసరి ఆదాయం ఏటా దాదాపు రూ.84 లక్షలు!

అంజలి లాహిరి తరపున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తూ.. నిందితుడు గతంలో అధికార పార్టీకి చెందినవాడని, ఆ తర్వాత అతని రాజకీయ అనుబంధం మారిందని కోర్టుకు తెలియజేశారు. ఆగస్ట్ 26న రాష్ట్ర అధికారులకు నిరసనల సమాచారం అందించబడిందని.. శాంతియుత ఆందోళనకారులను అపాయం కలిగించే దుష్ప్రవర్తన గురించి నిర్వాహకులు రాష్ట్రానికి తెలియజేశారని వాదించారు.

ఇది కూడా చదవండి: Gujarat High Court: భార్య వివాహేతర సంబంధం భర్త ఆత్మహత్యకు కారణం కాకపోవచ్చు..

కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనను నిరసిస్తూ చలో సెక్రటేరియట్‌ మార్చ్‌ నిర్వహించారు. ఆ రోజు రాత్రి ఛత్ర సమాజ్‌ నిర్వాహకుల్లో ఒకరైన సయన్‌ లాహిరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఆయన తల్లి హైకోర్టును ఆశ్రయించగా.. శుక్రవారం ఉన్నత న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది. దీనిపై బెంగాల్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఆగస్టు 9న కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో వైద్యురాలు హత్యాచారానికి గురైంది. అత్యంత క్రూరంగా ఆమె హత్యకు గురైంది. అనంతరం పెద్ద ఎత్తున ఆందోళనలు, నిరసనలు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ కేసును హైకోర్టు.. సీబీఐకి అప్పగించింది. ప్రస్తుతం సీబీఐ ఈ కేసును విచారిస్తోంది. పలువురిని ఇప్పటికే ప్రశ్నించింది.