RG Kar Case: ఆర్జీ కర్ ఆగ్రహం.. టీఎంసీ మాజీ ఎమ్మెల్యేకు చెప్పుల దండ, గుడ్లతో దాడి

  • ఆర్జీ కర్ కేసులో మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ అరెస్ట్.
  • మృత వైద్యురాలి మృతదేహాన్ని హడావుడిగా దహనం చేశారన్న ఆరోపణలు.
  • పోలీస్ స్టేషన్ నుంచి కోర్టుకు తరలిస్తుండగా మాజీ ఎమ్మెల్యేపై ప్రజాగ్రహం.
  • గుడ్లు, చెప్పులు, బూట్లు, బురదతో ఆందోళనకారుల దాడి.
Rg Kar Case

Rg Kar Case

RG Kar Case: పశ్చిమ బెంగాల్‌‌తో పాటు దేశ వ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైన ఆర్జీకర్ మెడికల్ కాలేజ్-హాస్పిటల్‌లో మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం ఎదురైంది. బాధిత వైద్యురాలి మృతదేహాన్ని హడావిడిగా అంత్యక్రియలు నిర్వహించిన ఆరోపణలపై మాజీ టీఎంసీ ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉత్తర 24 పరగణాల జిల్లా ఖర్దా పోలీస్ స్టేషన్ నుంచి పోలీసులు అతడిని కోర్టుకు తీసుకెళ్తుండగా ప్రజలు ఆగ్రహంతో దాడి చేశారు.

ఆగ్రహంలో ఉన్న ప్రజలు ఆయనపై పిడిగుద్దులతో, కాళ్లతో దాడి చేసింది. పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బంది నిర్మల్ ఘోష్ రక్షణ కోసం హెల్మెట్లు వాడినప్పటికీ, ప్రజలు ఆయనను లక్ష్యంగా చేసుకుంది. ఆగ్రహంతో ఉన్న గుంపు మాజీ ఎమ్మెల్యేపై బూట్లు, చెప్పులు, గుడ్లు, చివరికి బురద కూడా విసిరారు. వారు ఆయనకు బూట్ల దండ కూడా వేశారు. నిర్మల్ ఘోష్‌తో సహా అయన సన్నిహితుడు పానిహటి మాజీ కౌన్సిలర్ సంజీబ్ ముఖర్జీ కూడా ఇదే ఆగ్రహాన్ని ఎదుర్కొన్నారు. ముఖర్జీని, ఘోష్ కన్నా ఒక రోజు ముందు అరెస్ట్ చేశారు. పోస్టుమార్టం తర్వాత డాక్టర్ మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలిస్తున్నప్పుడు ముఖర్జీ అక్కడే ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

మరణించిన వైద్యురాలి తండ్రి సోమవారం దాఖలు చేసిన కొత్త ఫిర్యాదు ఆధారంగా ఈ అరెస్టులు జరిగాయి. కుటుంబ సభ్యుల కోరికకు వ్యతిరేకంగా అప్పటి ఎమ్మెల్యే నిర్మల్ ఘోష్ తన కుమార్తె అంత్యక్రియల్ని హడావిడిగా చేయించారని తండ్రి ఆరోపించారు. ఈ కేసుపై కొత్తగా దర్యాప్తు జరపాలని ముఖ్యమంత్రి సువేందు అధికారి బ్యారక్‌పూర్ పోలీస్ కమిషనర్‌కు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. దీని తర్వాత వీరిద్దరి అరెస్టులు జరిగాయి.

ఈ కేసులో ఏదో కుట్ర ఉందని బాధితురాలి కుటుంబం ఎప్పటి నుంచో ఆరోపిస్తోంది. పోలీసులు, రాజకీయ నాయకులు కుమ్మకై రాత్రికి రాత్రే మృతదేహాన్ని దహనం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలా చేసుండకపోతే మృతదేహానికి రెండో పోస్టుమార్టం జరిగి కీలక విషయాలు వెలుగులోకి వచ్చేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ కేసులో అప్పటి సీఎం మమతా బెనర్జీ పాత్రపై కూడా విచారణ జరపాలని డిమాండ్ చేశారు.