Site icon NTV Telugu

Rahul Gandhi: “కావాలనే నన్ను మాట్లాడనివ్వడం లేదు”.. స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ..

Rahul Gandhi

Rahul Gandhi

Rahul Gandhi: లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. జాతీయ భద్రతకు సంబంధించిన విషయంలో సభలో మాట్లాడే హక్కును నిరాకరించడాన్ని నిరసించారు. తన లేఖలో.. రాష్ట్రపతి ప్రసంగంపై తీర్మానంపై చర్చ సందర్భంగా తనను మాట్లాడటానికి అనుమతించలేదని రాహుల్ గాంధీ అన్నారు. సోమవారం తాను మాట్లాడుతున్నప్పుడు 2020 నాటి భారత్-చైనా ఘర్షణను ప్రస్తావిస్తూ, తాను ఒక మ్యాగజైన్‌లో వచ్చిన కథనాన్ని ఉదాహరణగా ప్రస్తావించడాన్ని స్పీకర్ ధ్రువీకరించాలని కోరారని అన్నారు.

Read Also: Airtel Unlimited Plans 2026: ఎయిర్‌టెల్ నయా ప్రీపెయిడ్ ప్లాన్స్‌.. రూ.399, 449కే అన్‌లిమిటెడ్ డేటా!

పార్లమెంటరీ సంప్రదాయాల ప్రకారం, ఒక సభ్యుడు ఏదైనా డాక్యుమెంట్‌ను ప్రస్తావించాలంటే దానిని ధ్రువీకరించాల్సిన బాధ్యత ఉందని, తాను ఆ విధానాన్ని పూర్తిగా పాటించానని రాహుల్ గాంధీ చెప్పారు. అయినప్పటికీ తనను మాట్లాడనీయలేదని లేఖలో పేర్కొన్నారు. ‘‘నన్ను ఉద్దేశపూర్వకంగా మాట్లాడనివ్వలేదనే అనుమానం కలుగుతోంది. ప్రతిపక్ష నాయకుడు జాతీయ భద్రత వంటి కీలమైన అంశంపై మాట్లాడనీయకపోవడం ప్రజాస్వామ్యానికి మచ్చ’’ అని రాహుల్ గాంధీ లేఖలో పేర్కొన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంలో జాతీయ భద్రత ప్రధానాంశంగా ఉందని, దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరగాల్సిందే అని రాహుల్ గాంధీ అన్నారు. స్పీకర్ రాజ్యంగబద్ధంగా, పార్లమెంటరీ బాధ్యతలతో తటస్థంగా ప్రతీ సభ్యుడి హక్కుల్ని కాపాడాలని గుర్తు చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రతిపక్ష నేతనైన తనను రాష్ట్రపతి ప్రసంగంపై మాట్లాడనీయలేదని ఆరోపించారు. ఇలా పార్లమెంటరీ చరిత్రలో ఎప్పుడూ జరగలేదని రాహుల్ గాంధీ అన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మచ్చ అని, దీనిపై తాను నిరసన తెలుపుతున్నట్లు లేఖలో పేర్కొన్నారు.

Exit mobile version