Rahul Gandhi: ఇన్ని ప్రమాదాలు జరుగుతున్నా గుణపాఠాలు నేర్చుకోరా..

  • తమిళనాడులో ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌..
  • ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా గుణపాఠాలు నేర్చుకోవడం లేదు..
  • ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి: రాహుల్ గాంధీ
Rahul

Rahul

Rahul Gandhi: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు సమీపంలో భాగమతి ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురైంది. ఈ క్రమంలో కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంధీ కేంద్ర సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ఘటన బాలాసోర్‌లో గూడ్స్‌ రైలును, ప్యాసింజర్‌ రైలు ఢీకొన్న ఘటనకు ప్రతిరూపంగా చెప్పుకొచ్చారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్‌ చేశారు. ‘మైసూర్‌- దర్బాంగా రైలు ప్రమాదం భయంకరమైన బాలాసోర్‌ ఘటనకు అద్దం పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. ఇక, ఆ ప్రమాదంలో ఒక ప్యాసింజ్‌ రైలు ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టగా.. పలుమార్లు ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నా గుణపాఠాలు నేర్చుకోవడం లేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి జవాబుదారీతనం పైస్థాయి నుంచే ఉండాలన్నారు. ఈ ప్రభుత్వం మేల్కొనేలోపు ఇంకా ఎన్ని కుటుంబాలు నాశనం కావాలి? అని రాహుల్ గాంధీ విమర్శించారు.

Read Also: Erracheera The Beginning: రాజేంద్రప్రసాద్ మనుమరాలు నటించిన ఎర్రచీర.. డిసెంబర్ 20న విడుదల

అయితే, మైసూర్‌ నుంచి దర్బాంగ వెళ్లాల్సిన భాగమతి ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగంగా వచ్చి ఆగి ఉన్న గూడ్స్‌ రైలును ఢీ కొట్టింది. ఈ ఘటనలో దాదాపు 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే, ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని తమిళనాడు సర్కార్ వెల్లడించింది. రైలు ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 22 ఆంబులెన్స్‌లు సంఘటన ప్రదేశానికి చేరుకున్నాయని రాష్ట్ర డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్‌ చెప్పుకొచ్చారు. ఇతర ప్రయాణికులకు మూడు కల్యాణ మండపాల్లో బస ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే, ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకునేలా ఇతర ఏర్పాట్లు కూడా చేస్తున్నామని చెప్పారు. అదే విధంగా రైలు ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఉదయనిధి స్టాలిన్ కోరారు.