అమెరికా పర్యటనలో సిక్కులపై కాంగ్రెస్ అగ్ర నేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సిక్కులు ఢిల్లీలో నిరసనలు చేపట్టారు. బీజేపీ నేతలు తీవ్రంగా తప్పుపట్టారు. తాజాగా అమెరికాలో చేసిన వ్యాఖ్యలపై రాహుల్ స్పందించారు. తన వ్యాఖ్యలపై బీజేపీ పార్టీ అసత్య ప్రచారం చేస్తోందని మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: Mallikarjun Kharge: బీజేపీ భారత్ని ప్రేమించొచ్చు, కానీ పాకిస్తాన్ని పెళ్లి చేసుకుంది..
‘‘భారతలోని సిక్కు సోదరసోదరీమణులను ఒక విషయం అడగాలని అనుకుంటున్నా. నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా తప్పు ఉందా..? ప్రతి సిక్కు, ప్రతి భారతీయుడు.. తన మతాన్ని నిర్భయంగా ఆచరించే దేశం భారత్ కాకూడదా? అమెరికా పర్యటనలో సిక్కులపై నేను చేసిన వ్యాఖ్యలను బీజేపీ వక్రీకరిస్తోంది. ఎప్పటిలాగే అసత్యాలు ప్రచారం చేస్తోంది. నిజాన్ని సహించలేకే నా నోరు మూయించాలనుకుంటోంది. భిన్నత్వంలో ఏకత్వం, సమానత్వం, ప్రేమ భారత్లో ఉన్నాయి. దేశ విలువల విషయంలో నేను ఎల్లప్పుడూ గొంతెత్తుతాను’’ అని రాహుల్ ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Sri Lanka: మొదలైన శ్రీలంక అధ్యక్ష ఓట్ల లెక్కింపు.. కొన్ని గంటల్లోనే ఫలితాలు వెల్లడి
అమెరికా పర్యటనలో భారతీయ అమెరికన్లను ఉద్దేశించి రాహుల్ మాట్లాడారు. తన ముందు కూర్చొన్న వారిలో తలపాగాతో ఉన్న వ్యక్తిని ఉద్దేశిస్తూ.. సిక్కులు తలపాగాలు, కడియాలు ధరించవచ్చా, వారు గురుద్వారాకు వెళ్లగలుగుతున్నారా అనే వాటిపైనే భారత్లో ఘర్షణలు జరుగుతున్నాయన్నారు. అన్ని మతాలకు ఇదే పరిస్థితి తప్పడం లేదన్నారు. దేశంలో రాజకీయాల కంటే మత స్వేచ్ఛపైనే పోరాటం కొనసాగుతోందన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ తీవ్రంగా తప్పు పట్టింది. భారత్ పరువు తీస్తున్నారని మండిపడింది.
ఇది కూడా చదవండి: Haryana polls: వినేష్ వర్సెస్ బబిత.. సోదరీమణుల మధ్య మాటల మంటలు