Rahul Gandhi: బీజేపీ ఎంపీలలో ప్రతి ఆరుగురిలో ఒకరు ఓట్ చోరీతో గెలిచారు.. రాహుల్ గాంధీ విమర్శలు

Rahulganhdi

Rahulganhdi

లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మరోసారి బీజేపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. “ఓట్ల దొంగతనం” ఆరోపణలను పునరుద్ఘాటిస్తూ సోషల్ మీడియాలో ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓట్ల దొంగతనం వల్ల కొన్నిసార్లు సీట్లు మాత్రమే కాదు, మొత్తం ప్రభుత్వాలే కూలిపోతాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన పోస్టులో గణాంకాలను ప్రస్తావిస్తూ, లోక్‌సభలోని 240 మంది బీజేపీ ఎంపీలలో సుమారు ఆరుగురిలో ఒకరు ఓట్ల దొంగతనం ద్వారా గెలిచారని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో బీజేపీ సొంత పరిభాషలోనే వారిని “చొరబాటుదారులు” అని పిలవాలా? అంటూ వ్యంగ్యంగా ప్రశ్నించారు.

ఓటర్ల జాబితాపై ఆరోపణలు

రాహుల్ గాంధీ ఓటర్ల జాబితాలు, ఎన్నికల ప్రక్రియలపై కూడా తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని సంస్థలు అధికార పార్టీ ప్రభావంలో పనిచేస్తూ, ఎన్నికల వ్యవస్థను రిమోట్ కంట్రోల్ చేస్తున్నాయని రాహుల్ ఆరోపించారు. “వారి అసలు భయం సత్యం పట్లే. ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగితే, ఈరోజు వారు 140 స్థానాలకు దగ్గరగా కూడా గెలవలేరు” అని రాహుల్ అన్నారు.

హర్యానా ప్రభుత్వంపై విమర్శలు

హర్యానా ప్రభుత్వాన్ని ప్రస్తావిస్తూ, అక్కడి మొత్తం ప్రభుత్వమే ఒక “చొరబాటుదారు”లా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. ఓట్ల దొంగతనం, ఎన్నికల అక్రమాల కారణంగానే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

ఎన్నికల సంఘంపై విమర్శలు

ఇటీవల పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల అనంతరం కూడా రాహుల్ గాంధీ ఎన్నికల సంఘంపై విమర్శలు చేశారు. ఎన్నికల నిర్వహణలో పారదర్శకత ఉండాలని, ఓటర్ల జాబితాలపై పూర్తి స్థాయి పరిశీలన జరగాలని డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ నుంచి దీనిపై ఎలాంటి ప్రతిస్పందన వస్తుందనేది ఆసక్తికరంగా మారింది.