Priyanka Gandhi: లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఈ నెల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్-మేలో ఎన్నికలు పూర్తి అవనున్నాయి. ఇప్పటికే బీజేపీ 192 మందితో తొలి విడత జాబితాను విడుదల చేసింది. మరోవైపు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఓ విషయం కాంగ్రెస్ శ్రేణులకు షాక్ ఇస్తోంది. కాంగ్రెస్ ప్రధాన నాయకురాలు, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రియాంకాగాంధీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండే అవకాశం ఉందని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.
Read Also: USA: 2050 నాటికి న్యూయార్క్తో సహా సముద్రంలో కలవనున్న 32 నగరాలు..
సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోనియాగాంధీ ఇప్పటికే రాయ్బరేలీ పోటీ నుంచి తప్పుకుని, రాజస్థాన్ నుంచి రాజ్యసభ నుంచి ఎంపీగా ఎన్నియ్యారు. ఈ పరిణామం తర్వాత ప్రియాంకా గాంధీ ఈ స్థానం నుంచి బరిలోకి దిగుతారనే వార్తలు వినిపించాయి. సోనియా గాంధీ రాయ్బరేలీ ప్రజల్ని ఉద్దేశించి రాసిన లేఖలో ‘‘ రాయ్బరేలీలో మా కుటుంబం యొక్క మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. గతంలో మాదిరిగానే భవిష్యత్తులోనూ మీరు నాకు మరియు నా కుటుంబానికి అండగా ఉంటారని నాకు తెలుసు’’ అని అన్నారు. అయితే, గురువారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అభ్యర్థులపై పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం జరగబోతోంది. అయితే, ప్రియాంకాగాంధీ పోటీలో ఉంటారో లేదో అని స్పష్టంగా తెలియాలంటే మరికొంత సమయం వేచిచూడాల్సిందే.