ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ప్రయాగ్ రాజ్ చేరుకున్న ఆయన త్రివేణి సంగమంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గంగా మాతకు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దేశ శ్రేయస్సు కోసం మోడీ ప్రార్ధించారు. మోడీ వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ వచ్చారు. ప్రధాని మోదీ మరియు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏరియల్ ఘాట్ నుంచి మహాకుంభ్ వరకు పడవ ప్రయాణం చేశారు. ప్రధాని పర్యటన వేళ భద్రతా సిబ్బంది ఆ ప్రాంతమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
మహాకుంభమేళా ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. దేశ విదేశాల నుంచి కోట్లాది మంది భక్తులు కుంభమేళాలో పాల్గొంటున్నారు. అన్ని దార్లు ప్రయాగ్ రాజ్ వైపే పయనిస్తు్న్నాయి. రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా భక్తులు ప్రయాగ్ రాజ్ చేరుకుంటున్నారు. కుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న యోగీ సర్కార్ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. పేద, ధనిక అనే తేడా లేకుండా అంతా కుంభమేళాలో పాల్గొంటున్నారు.