Election Rigging: బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎట్టకేలకు ఎన్నికల వ్యూహకర్త, జన్ సూరజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ మౌనం వీడారు. తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి చాలా బాధిస్తుంది.. ఎన్నికలకు సంబంధించి కొన్ని విషయాలు నాకు సరిపోలడం లేదు. ఏదో తప్పు జరిగినట్లు కనిపిస్తోంది.. ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగినట్టు అర్థమవుతుంది. కానీ, దానికి సంబంధించిన ఆధారాలు ప్రస్తుతానికి నా దగ్గర లేవని వెల్లడించారు. ఓడిపోయిన తర్వాత అందరూ ఇలాంటి మాటలే మాట్లాడతారని అనుకుంటారు.. ఎప్పటికైనా ఆధారాలు బయటకు వస్తాయని పీకే చెప్పుకొచ్చారు.
Read Also: Hyderabad: కిరాయి ఇంట్లో ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురు ఆత్మహత్య.. యజమాని కీలక వ్యాఖ్యలు..
అయితే, ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయడానికి బీహార్లోని వేలాది మంది మహిళా ఓటర్లకు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్డీయే) డబ్బులు పంపిణీ చేసిందని ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. ఎన్నికలకు ముందు రాష్ట్రంలో 50 వేల మంది మహిళలకు రూ. 10 వేలు ఇవ్వడం కూడా ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపించింది అన్నారు. అలాగే, ఎన్నికల ప్రచారం చివరి నాటికి మా పార్టీ గెలిచే స్థితిలో లేదని కొందరు ఓటర్లు అయోమయానికి గురయ్యారు. ఈ క్రమంలో లాలూ జంగిల్ రాజ్ సర్కార్ రావొద్దనే ఎన్డీయే కూటమికి సపోర్టు చేశారని పేర్కొన్నాడు. కాగా, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 238 సీట్లలో పోటీ చేసిన ప్రశాంత్ కిషోర్ జన్ సూరజ్ పార్టీ.. ఒక్క నియోజకవర్గంలో కూడా విజయం సాధించలేదు. కేవలం 2 నుంచి 3 శాతం ఓట్లను మాత్రమే సాధించింది. ఆయన పార్టీ అభ్యర్థులలో ఎక్కువ మంది డిపాజిట్లు గల్లంతు అయ్యాయి.