AIADMK Crisis: తమిళనాడు రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి. ప్రతిపక్ష పార్టీ అయిన అన్నా డీఎంకేలో అంతర్గత విభేదాలు మళ్లీ బయటపడుతున్నాయి. ఒకవైపు ఎమ్మెల్యేల రాజీనామాలు, మరోవైపు పార్టీని కాపాడుకునేందుకు మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఎత్తుగడలు వేస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో ముఖ్యమంత్రి విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ పరిస్థితులను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అన్నాడీఎంకేలో అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించే దిశగా టీవీకే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామికి మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి వర్గం డెడ్లైన్ విధించడం పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. ఈ సాయంత్రంలోగా పార్టీ వివాదాలకు సామరస్యపూర్వక పరిష్కారం చూపాలని వేలుమణి వర్గం డిమాండ్ చేసింది. ఈపీఎస్ వైఖరిపై అసంతృప్తితో ఉన్న 16 మంది ఎమ్మెల్యేలు కూడా వేలుమణి వర్గానికి మద్దతుగా ఉన్నట్లు సమాచారం. ఇటీవల విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా ఓటు వేసిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు స్పీకర్కు లేఖ ఇవ్వడానికి ఈ నెల 28 వరకు గడువు ఉన్నట్లు తెలుస్తోంది.
ఈపీఎస్ తక్షణ నిర్ణయం తీసుకోకపోతే తదుపరి కార్యాచరణకు సిద్ధమవుతున్నామని వేలుమణి వర్గం సంకేతాలు ఇస్తోంది. దీంతో అన్నాడీఎంకేలో పరిస్థితులు రోజురోజుకూ క్లిష్టంగా మారుతున్నాయి. తమిళనాడు రాజకీయాల్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయ సమీకరణాలను ప్రభావితం చేసే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా, అన్నాడీఎంకేలో ఎమ్మెల్యేల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది.. ఇవాళ అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా చేశారు.. నిన్న ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం.. టీవీకే పార్టీలో చేరిన విషయం విదితమే కాగా.. ఇవాళ మరో ఎమ్మెల్యే.. గుడ్బై చెప్పడంతో.. అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది..
