Prashant Kishor: ప్రస్తుతం లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ప్రధాని నరేంద్రమోడీ మరోసారి విజయపథంలో నిడిపించే అవకాశం ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న బీజేపీపై ప్రజలకు కోపం పెద్దగా లేదని చెప్పారు. అయితే, బీజేపీ చెబుతున్నట్లు 370 సీట్లను మాత్రం దాటకపోవచ్చని చెప్పారు.
మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూమి అధికారంలోకి వస్తుందని తాను భావిస్తున్నానని, అయితే గత ఎన్నికల్లో(2019) పొందిన సీట్ల సంఖ్యను లేదా కొంచెం ఎక్కువ స్థానాలు గెలువవచ్చని ఆయన అంచనా వేశారు. వారు చెబుతున్నట్లు 370 సీట్లు రాకపోవచ్చని అన్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వంపై కోపం ఉంటే, దానికి ప్రత్యామ్నాయం ఉండాలి అప్పుడే ప్రజలు వారికి ఓటేయాలని నిర్ణయించుకుంటారని ఆయన అన్నారు. మోడీపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందనే వాదనల్ని మనం ఎప్పుడూ వినలేదని చెప్పారు.
Read Also: Arvind Kejriwal: నా భార్య ‘‘ఝాన్సీ రాణి’’.. సునీతా కేజ్రీవాల్ని ప్రమోట్ చేస్తున్న ఆప్ చీఫ్..
ఉత్తర, పశ్చిమ భారతదేశంలో దాదాపుగా 325 లోక్సభ స్థానాలు కలిగి ఉందని, ఈ బెల్టు బీజేపీకి 2014 నుంచి బలమైన కోటగా ఉందని, తూర్పు-దక్షిణ ప్రాంతాల్లో బీజేపీకి పెద్దగా పట్టు లేదని, ఏదైనా నష్టం జరిగితే అది ఉత్తరం, పశ్చిమ భారతదేశాల్లోనే జరగాలని ప్రశాంత్ కిషోర్ విశ్లేషించారు. అయితే, ఈ సారి దక్షిణాదిన, తూర్పున బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగే అవకాశం ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా బీజేపీకి సీట్లు తగ్గే ఛాన్స్ చాలా తక్కువగా ఉందని అన్నారు.
మోడీ తప్పిదాలను ఇండియా కూటమి ఉపయోగించుకోలేదని అన్నారు. ఇండియా కూటమి కార్యరూపం దాల్చే సమయానికి చాలా ఆలస్యమైందన్నారు. ప్రధాన మంత్రి అభ్యర్థిత్వాన్ని ప్రకటించడంలో కూటమి విఫలమైందని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా స్ట్రాంగ్ వ్యక్తి, బలమైన కథనం లేదని చెప్పారు. 2024 లోక్సభ ఎన్నికలతో సహా బీజేపీని ఓడించడమే తమ లక్ష్యం అని చెబుతున్న ప్రతిపక్షాలు గతేడాది నవంబర్లో జరిగిన ఎన్నికల్లో దారుణంగా విఫలమైనట్లు తెలిపారు.