PM Modi: ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటన ఖర్చుల వివరాలను కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 23 దేశాలకు చేసిన విదేశీ పర్యటనల కోసం దాదాపు రూ.187 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది. అలాగే 2026లో ఇప్పటివరకు జరిగిన విదేశీ పర్యటనలపై రూ.74.58 కోట్లు వ్యయమైనట్లు తెలిపింది. ఇందులో ఈ ఏడాది జూలై 6 నుంచి 11 వరకు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ పర్యటనల వ్యయం కూడా ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), సీపీఎం ఎంపీలు సంజయ్ సింగ్, వి. శివదాసన్ అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయమంత్రి పవిత్ర మార్గరీటా లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.
2021 నుంచి ప్రధాని విదేశీ పర్యటన వివరాలు, వాటికి అయిన ఖర్చు, పర్యటనల సందర్భంగా కుదిరిన ఎంఓయూలు, అలాగే దేశంలోకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(FDI) సమాచారాన్ని పార్లమెంట్కు సమర్పించారు. ఏప్రిల్ 2021 నుంచి డిసెంబర్ 2025 వరకు భారత్లోకి 381.8 బిలియన్ డాలర్ల FDIలు వచ్చాయని కేంద్రం వెల్లడించింది. ఈ పర్యటనల ద్వారా సాంకేతిక, ఆవిష్కరణలు, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, ఇంధనం వంటి రంగాల్లో అనేక కీలక ఒప్పందాలు కుదిరినట్లు కేంద్రం చెప్పింది. ఇదే సమయంలో ఆయా దేశాలతో భారత సంబందాల బలోపేతమైనట్లు తెలిపింది.

