PM Modi’s Message to Gen Z: సోషల్ మీడియా ప్రభావం పెరిగిన ప్రస్తుత కాలంలో యువత, ముఖ్యంగా జెన్-జెడ్ తరం వారు సులభమైన మార్గాలు, షార్ట్కట్లకు ఆకర్షితులు కావద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సూచించారు. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ది ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని.. యువతకు పలు కీలక సూచనలు చేశారు.
కోవింద్ ప్రజాసేవకు ఆదర్శం
రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ ఒక ప్రత్యేక ఆదర్శాన్ని నెలకొల్పారని ప్రధాని మోడీ ప్రశంసించారు. పదవి నుంచి వైదొలిగిన తర్వాత కూడా కోవింద్ దేశం కోసం పనిచేస్తూనే ఉన్నారని తెలిపారు. ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ అమలు కోసం ఏర్పాటు చేసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి ఆయన ఛైర్మన్గా వ్యవహరిస్తున్న విషయాన్ని ప్రధాని ప్రస్తావించారు. కోవింద్ ఆత్మకథను దేశంలోని కొత్త తరం తప్పకుండా చదవాలని మోదీ సూచించారు. ఈ పుస్తకం కోవింద్ వ్యక్తిగత జీవితం, ఆయన ఎదుర్కొన్న పోరాటాలను వివరిస్తుందని తెలిపారు. అయితే ఆయన విజయం కేవలం వ్యక్తిగత విజయం కాదని, భారత గణతంత్రం, ప్రజాస్వామ్యానికి కూడా లభించిన విజయమని ప్రధాని పేర్కొన్నారు.
ప్రోటోకాల్ను పక్కనపెట్టి ఆత్మీయంగా..
రాష్ట్రపతి భవన్లో కోవింద్ను కలిసిన సందర్భాలను కూడా ప్రధాని మోడీ గుర్తుచేసుకున్నారు. ప్రధానమంత్రిగా తాను రాష్ట్రపతి భవన్కు వెళ్లినప్పుడు కోవింద్ తరచూ ప్రోటోకాల్ను పక్కనపెట్టి తనతో ఆత్మీయంగా మాట్లాడేవారని చెప్పారు. అంతేకాకుండా, తాను తిరిగి వెళ్లే సమయంలో వీడ్కోలు పలికేందుకు కారు వద్దకు కూడా కోవింద్ వచ్చేవారని తెలిపారు. అలా చేయవద్దని తాను పలుమార్లు కోరినప్పటికీ కోవింద్ మాత్రం తన ఆత్మీయతను కొనసాగించేవారని మోడీ గుర్తుచేశారు. ఆయనలోని వినయం, సంస్కారం, మానవీయ విలువలను ఈ సందర్భంగా ప్రధాని కొనియాడారు.
స్వగ్రామంలో కోవింద్ వినయం
రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతిగా ఉన్న సమయంలో తన స్వగ్రామం పరుంఖ్ను సందర్శించిన సందర్భాన్ని కూడా మోడీ ప్రస్తావించారు. గ్రామానికి వెళ్లిన కోవింద్ తన ఉపాధ్యాయుల పాదాలకు నమస్కరించారని, గ్రామ మట్టికి నమస్కరించి అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారని చెప్పారు. కోవింద్ చేసిన ఈ భావోద్వేగపూరిత చర్యను దేశమంతా చూసిందని ప్రధాని అన్నారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను ఆయన తన ప్రవర్తన ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారని పేర్కొన్నారు. ఆయన సరళత, వినయం ప్రతి భారతీయుడూ గర్వపడేలా చేశాయని అన్నారు.
రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావంపై హెచ్చరిక
ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో రీల్స్, ఇన్ఫ్లుయెన్సర్లు యువతపై గణనీయమైన ప్రభావం చూపుతున్నారని ప్రధాని మోడీ అన్నారు. ఇన్ఫ్లుయెన్సర్లను అనుసరించడంలో తప్పులేదని, అయితే వారు చూపించే ప్రతి సులభమైన మార్గాన్ని అనుసరించే ముందు ఆలోచించాలని సూచించారు. జీవితంలో త్వరగా విజయం సాధించాలనే ఉద్దేశంతో షార్ట్కట్లను ఎంచుకోవడం ప్రమాదకరమని హెచ్చరించారు. దీనికి ఉదాహరణగా రైల్వే స్టేషన్లలోని పరిస్థితిని ప్రస్తావించారు. వంతెనను ఉపయోగించకుండా కొందరు రైల్వే పట్టాలను దాటి వెళ్లేందుకు ప్రయత్నిస్తారని, అలాంటి సత్వర మార్గం ప్రమాదానికి దారితీస్తుందని చెప్పారు. “సత్వరమార్గం మిమ్మల్ని దెబ్బతీస్తుంది” అనే సందేశాన్ని యువత గుర్తుంచుకోవాలని సూచించారు.
ఆత్మకథలు చదవాలని యువతకు పిలుపు
జీవితంలో ముందుకు సాగాలంటే ఇతరుల అనుభవాల నుంచి నేర్చుకోవడం ఎంతో ముఖ్యమని ప్రధాని మోడీ అన్నారు. తమకు నచ్చిన వ్యక్తుల ఆత్మకథలను యువత చదవాలని సూచించారు. వారి విజయాలు, వైఫల్యాలు, పోరాటాలు, అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలని చెప్పారు. రామ్నాథ్ కోవింద్ జీవిత ప్రయాణం కూడా యువతకు ఎన్నో విలువైన పాఠాలను అందిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. సోషల్ మీడియా చూపించే తక్షణ విజయాల కంటే నిజ జీవిత అనుభవాలు, క్రమశిక్షణ, కృషి, విలువలకు ప్రాధాన్యం ఇవ్వాలని జెన్-జెడ్కు పరోక్షంగా సూచించారు ప్రధాని నరేంద్ర మోడీ..

