Site icon NTV Telugu

PM Modi: తల్లులు, సోదరీమణులకు ఇచ్చే గౌరవమే దేశానికి గౌరవం

Pmmodi

Pmmodi

నేటి నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా సాధికారిత దిశగా దేశం చారిత్రాత్మక అడుగులు వేయడానికి సిద్ధంగా ఉందని ప్రధాని మోడీ అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్న సందర్భంగా మహిళలను ఉద్దేశించి ఎక్స్‌లో కీలక ట్వీట్ చేశారు. ‘‘నేటి నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా సాధికారత దిశగా దేశం చారిత్రాత్మక అడుగు వేయడానికి సిద్ధంగా ఉంది. మా తల్లులు, అక్కాచెల్లెళ్లకు ఇచ్చే గౌరవమే దేశానికి ఇచ్చే గౌరవం. ఇదే స్ఫూర్తితో మేము ఆ దిశగా దృఢసంకల్పంతో ముందుకు సాగుతున్నాము.’’ అని పేర్కొన్నారు.

నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. 2023లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ చట్టమైన నారీ శక్తి వందన్ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడమే ఈ బిల్లుల లక్ష్యం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం, లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 850కు పెంచడమే మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.

మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ బిల్లులను కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రవేశపెడుతుండగా.. మూడో బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభలో 18 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు. అనంతరం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు. అక్కడ 10 గంటల పాటు చర్చ చేపట్టనున్నారు.

ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్రం దురుద్దేశంతోనే తీసుకొస్తోందని ఆరోపించింది. అయితే బిల్లులపై ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య ఫైటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయా? లేదా అన్నది వేచి చూడాలి.

 

Exit mobile version