NITI Aayog: నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం..

  • నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన నీతి అయోగ్ సమావేశం..
  • వికసిత భారత్‌ 2047’ విజన్‌పై ఈ మీటింగ్ లో చర్చ..
  • నీతి అయోగ్ సమావేశాన్ని బహిష్కరించిన కాంగ్రెస్ పాలిత ముఖ్యమంత్రులు..
Nitit Ayoge

Nitit Ayoge

NITI Aayog: నీతి ఆయోగ్‌ 9వ పాలకమండలి మీటింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఇవాళ (శనివారం) ఉదయం రాష్ట్రపతి భవన్‌ సాంస్కృతిక కేంద్రంలో జరగబోతుంది. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు రూపొందించిన ‘వికసిత భారత్‌ 2047’ అజెండాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. పరిపాలనలో ప్రజల భాగస్వామ్యం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపరిచే అంశాలపై ప్రధానంగా చర్చించే ఛాన్స్ ఉంది. ప్రజలకు సేవలు అందించే ప్రభుత్వ యంత్రాంగాలను బలోపేతం చేయడంతో పాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపర్చడంపై ఈ మీటింగ్ లో చర్చిస్తారు.

Read Also: Off The Record: ఢిల్లీ ధర్నాకు డుమ్మా.. బాలినేని భవిష్యత్తు ఎటువైపు..?

ఇక, వికసిత భారత్‌ 2047 లక్ష్యాన్ని సాధించడంలో రాష్ట్రాల పాత్రపై విస్తృతస్థాయిలో నీతి అయోగ్ మీటింగ్ లో సమాలోచనలు జరిపే అవకాశం ఉంది. 5 లక్షల కోట్ల డాలర్ల జీడీపీని అధిగమించి ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థికవ్యవస్థగా ఎదిగే క్రమంలో ఉన్న భారత్‌ను 2047 నాటికి 30 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి తీసుకెళ్లడంపైనా ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు. ఈ పాలకమండలి సమావేశంలో 2023 డిసెంబరు 27- 29 తేదీల్లో జరిగిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల మూడో సమావేశం చేసిన సిఫార్సులపైనా కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రజల జీవనాన్ని సులభతరం చేసేందుకు నాణ్యమైన విద్యుత్తు, శుద్ధి చేసిన నీరు, నాణ్యమైన వైద్యసేవలు, అందుబాటులో పాఠశాలలు ఉంచేందుకు ఏం చేయాలన్నదానిపై ఈ మీటింగ్ లో చర్చిస్తారు. నేటి (శనివారం) నీతి ఆయోగ్‌ పాలకమండలి సమావేశంలో అన్ని రాష్ట్రాల సీఎంలు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, కేంద్రమంత్రులు, ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు, ఇతర సభ్యులు పాల్గొనే అవకాశం ఉంది.

Read Also: Astrology: జులై 27, శనివారం దినఫలాలు

కాగా, ఈ సమావేశానికి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, చంద్రబాబు, ఏక్ నాథ్ షిండే, నితీష్ కుమార్, యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీజేపీపాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొంటున్నారు. మరోవైపు కేంద్ర బడ్జెట్‌లో జరిగిన అన్యాయానికి నిరసనగా కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు.. ఈ మీటింగ్ ను బహిష్కరించాలని నిర్ణయించడంతో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు కర్ణాటక, హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎంలు సిద్దరామయ్య, సుఖ్విందర్‌ సింగ్‌ సుఖూ ఇందులో పాల్గొనలేదు.. మరోవైపు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్‌ ముఖ్యమంత్రి భగవంత్‌ మాన్‌ ఈ భేటీకి దూరంగా ఉండనున్నట్లు తెలుస్తుంది.