PM Narendra Modi: ప్రధాని మోదీకి పుతిన్ ఫోన్.. యుద్ధంపై సంభాషణ

Modi, Putin

Modi, Putin

PM Modi, Russian President Vladimir Putin speak on phone: భారత్, రష్యా మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ప్రధాని నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. ఇరు నేతలు రెండు దేశాల దౌత్య సంబంధాలు, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై సంభాషించినట్లు పీఎంఓ తెలిపింది. ఉక్రెయిన్ తో యుద్ధంలో దౌత్యమే ఏకైక మార్గమని ప్రధాని మోదీ పుతిన్ కు పునరుద్ఘాటించారని వెల్లడించింది. పుతిన్, మోదీతో మాట్లాడినట్లు క్రెమ్లిన్ వర్గాలు కూడా ధృవీకరించాయి.

కొన్ని నెలల క్రితం ఉజ్బకిస్తాన్ సమర్ కండ్ లో జరిగిన షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్ సీ ఓ) సమావేశంలో ప్రధాని మోదీ, రష్యా ప్రెసిడెంట్ పుతిన్ చర్చించుకున్నారు. ఆ తరువాత ప్రస్తుతం ఇప్పుడే మళ్లీ ఇరుదేశాల నేతలు టెలిఫోన్ లో ముచ్చటించారు. గతంలో ఎస్ సీ ఓ సమ్మిట్ లో రష్యా, భారత దేశాల మధ్య ఇంధన సహకారం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ-భద్రతా సహకారం, ఇతర రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాల గురించి ఇరు నేతలు ముచ్చటించారు. ఆ సమయంలో ‘ ఇది యుద్ధాలకు సమయం’ కాదని మోదీ, పుతిన్ కు సూచించారు.

Read Also: Jamia Masjid: స్త్రీ-పురుషులు కలిసి కూర్చోవడం, ఫోటోగ్రఫీపై జామియా మసీద్ నిషేధం

ఇదిలా ఉంటే తాజాగా టెలిఫోన్ సంభాషనలో ప్రధాని మోదీ భారత్ జీ-20 అధ్యక్ష బాధ్యతల గురించి పుతిన్ కు వివరించారు. దీంతో పాటు ఈ ఏడాది షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ అధ్యక్ష బాధ్యతలను కూడా భారతదేశమే నిర్వహిస్తోంది. ఈ సమయంలో రెండు దేశాలు కలిసి పనిచేయాలని ప్రధాని మోదీ, పుతిన్ తో అన్నారని పీఎంఓ తెలిపింది.

ఇదిలా ఉంటే భారత దేశానికి రష్యా డిస్కౌంట్ పై ఆయిల్ సరఫరా చేస్తోంది. పాశ్చాత్య దేశాల బెదిరింపులను లెక్కచేయకుండా భారత్ కొనుగోలు చేస్తోంది. ఇదిలా ఉంటే భారత్ నుంచి కొన్ని విడిభాగాలను సరఫరా చేయాలని రష్యా కోరుతోంది. ఈ మేరకు భారత ప్రభుత్వానికి కావాల్సిన వస్తువుల గురించి తెలిపింది. భారత్ కూడా రష్యాకు కావాల్సిన వస్తువులను సరఫరా చేయాలనే ఉద్దేశ్యంతోనే ఉంది.