సోషల్ మీడియా ప్రపంచంలో ప్రధాని మోడీ దూసుకుపోతున్నారు. తాజాగా మరో ఘనత సాధించారు. యూట్యూబ్లో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంది ఫాలోవర్లను కలిగిన నాయకుడిగా మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. తాజాగా మోడీ యూట్యూబ్ ఛానల్ 3 కోట్ల మంది సబ్స్కైబర్లను దాటేసింది. 30 మిలియన్ సబ్స్క్రైబర్ల మైలురాయి దాటిన తొలి ప్రపంచ నేతగా మోడీ నిలిచారు.
మొదటి స్థానంలో మోడీ నిలువగా.. రెండో స్థానంలో బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు. మోడీ సబ్స్కైబర్లలో కేవలం నాలుగో వంతు మాత్రమే జైర్ బోల్సోనారోకు ఉండడం విశేషం. ఇక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో పోలిస్తే.. సబ్స్కైబర్ల సంఖ్య ఏడు రెట్లు ఎక్కువగా ఉంది.
ఇక దేశీయంగా కూడా ప్రధాని మోడీ ఆదిపత్యం చెలాయిస్తున్నారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో పోలిస్తే దాదాపు మూడు రెట్లు ఎక్కువ సబ్స్కైబర్లను మోడీ కలిగి ఉన్నారు. అలాగే ఆమ్ ఆద్మీ, కాంగ్రెస్ అధికారిక యూట్యూబ్ ఛానళ్ల కంటే కూడా నాలుగు రెట్లు ఎక్కువగా మోడీ ఛానల్ను అనుసరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవలే ఇన్స్టాగ్రామ్లో కూడా మోడీ రికార్డ్ నెలకొల్పారు. ఫాలోవర్ల సంఖ్య 10 కోట్లకు చేరింది. ప్రపంచ దేశాల్లోని రాజకీయ నేతల్లో 100 మిలియన్ల ఫాలోవర్లు సాధించిన తొలి నేతగా రికార్డు సృష్టించారు. మోడీ తర్వాత రెండో స్థానంలో ఉన్న ట్రంప్నకు ఇన్స్టాలో 4.35 కోట్ల ఫాలోవర్లు ఉన్నారు.
