PM Modi: బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ.. జెన్‌-జీపై ప్రత్యేక ఫోకస్

  • బీజేపీ కొత్త టీమ్‌తో మోడీ భేటీ
  • జెన్‌-జీపై ప్రత్యేక ఫోకస్
  • త్వరలో యువతతో సమావేశాలు
Pmmodi

Pmmodi

బీజేపీ కొత్తగా నియమించిన జాతీయ కార్యవర్గ సభ్యులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ప్రధాని.. పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నియమించిన కొత్త టీమ్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో యువతతో పార్టీ అనుసంధానం, పార్టీ సిద్ధాంతాలను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

భేటీకి ముందు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ కొత్తగా ఏర్పాటైన జాతీయ కార్యవర్గంతో తొలి పరిచయ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో బీజేపీ కొత్త ఆఫీస్ బేరర్ల కొత్త ఇన్నింగ్స్ అధికారికంగా ప్రారంభమైంది. పార్టీ సంస్థాగత కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడంతో పాటు.. దేశవ్యాప్తంగా యువతను మరింతగా చేరుకునేందుకు బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

జెన్‌-జీపై ప్రత్యేక దృష్టి

యువతతో ప్రత్యక్షంగా, నిరంతరం సంభాషించేందుకు బీజేపీ త్వరలో ‘జెన్ జెడ్ అవుట్‌రీచ్ ప్రోగ్రామ్’’ను ప్రారంభించనుంది. ఈ కార్యక్రమం ద్వారా కొత్త తరం యువత ఆకాంక్షలు, సమస్యలు, అభిప్రాయాలు, భవిష్యత్ అంచనాలను తెలుసుకోవడంపై పార్టీ దృష్టి పెట్టనుంది. అలాగే యువత నేరుగా బీజేపీ నేతలతో మాట్లాడేందుకు.. తమ సమస్యలు, అభిప్రాయాలను పంచుకునేందుకు వేదిక కల్పించనున్నట్లు తెలుస్తోంది. చర్చలు, పరస్పర సమావేశాలు, ఇతర కార్యక్రమాల ద్వారా యువ ఓటర్లతో పార్టీ అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని బీజేపీ భావిస్తోంది.

టీమ్‌లో కీలక నేతలు

ఈ ప్రత్యేక కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టీమ్‌లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, జాతీయ ప్రధాన కార్యదర్శులు స్మృతి ఇరానీ, వినోద్ తావ్డే, గుజరాత్ మంత్రి హర్ష్ సంఘవి, ఛత్తీస్‌గఢ్ మంత్రి ఓపీ చౌదరి సహా పలువురు నేతలకు చోటు కల్పించారు. సంస్థాగత అనుభవం ఉన్న నేతలతో పాటు యువతకు చేరువగా ఉండే నాయకత్వాన్ని కలిపి కొత్త తరంతో అనుసంధానం పెంచుకోవాలన్న బీజేపీ వ్యూహాన్ని ఈ టీమ్ ప్రతిబింబిస్తోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

త్వరలో కార్యక్రమం ప్రారంభం

జెన్‌-జీ ప్రోగ్రామ్ త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. కార్యక్రమం ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా నిర్వహించాలనే దానిపై మరిన్ని వివరాలను పార్టీ త్వరలో ప్రకటించనుంది. దేశవ్యాప్తంగా యువతతో ప్రత్యక్ష సంబంధాలను పెంచుకోవడం, వారి ఆలోచనలు, సమస్యలను తెలుసుకోవడం, పార్టీ కార్యకలాపాల్లో యువత భాగస్వామ్యాన్ని పెంచడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యాలుగా ఉండనున్నాయి.